ఎనికెపల్లిలో రాష్ట్రకూటుల నాటి జైన శిలాఫలకాలు!
ABN , First Publish Date - 2023-06-26T02:57:29+05:30 IST
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎనికెపల్లి శివారులో వెయ్యేళ్ల నాటి జైన తీర్థంకర శిలాఫలకాలను పరిశీలించినట్లు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని
తెలుగు, కన్నడ శాసనాలున్నాయన్న పరిశోధకుడు శివనాగిరెడ్డి
హైదరాబాద్ సిటీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎనికెపల్లి శివారులో వెయ్యేళ్ల నాటి జైన తీర్థంకర శిలాఫలకాలను పరిశీలించినట్లు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రకూటుల కాలం నాటి ఈ పురాతన శిలా ఫలకాలను ఊరిచెరువు కట్ట తూముకు ఇరువైపులా ఒకటి గ్రానైట్, మరొకటి నల్ల రాతి స్తంభాలను బిగించినట్లు తెలుస్తోందన్నారు. ‘‘వాటి మీద ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్థమాన మహావీర శిల్పాలు ధ్యాన ముద్రలో దర్శనమిస్తాయి. రెండు శిలా ఫలకాల మీద క్రీ.శ. తొమ్మిది నుంచి పదో శతాబ్దం మధ్య కాలం నాటి తెలుగు, కన్నడ శాసనాలున్నాయని గుర్తించాం. అయితే అవి జైన బసదికి చెందిన దాన శాసనాలుగా తెలుస్తోంది. సుమారు వందేళ్ల కిందట నిర్మించిన ఈ తూముకు స్థానిక శిథిల జైనాలయం నుంచి తెచ్చిన శిలా ఫలకాలను తెచ్చి బిగించి ఉంటారు’’ అని శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రెండు జైన చౌముఖ శిలాఫలకాలను వెలికితీసి భద్రపరచాలని మరో పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్రెడ్డి స్థానికులను కోరారు.