పెరిగిన విద్యుత్ వినియోగం
ABN , First Publish Date - 2023-02-14T00:52:37+05:30 IST
శివరాత్రి రాకముందే పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగ డిమాండ్ పెరిగింది. వరి పొట్ట దశకు రాకముందే మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం పెరిగింది. నల్లగొండ జిల్లాలో విద్యుత్ రోజువారీ వినియోగం సగటున 16మిలియన్ యూనిట్లు కాగా, ఈనెల 12వ తేదీన 19మిలియన్ యూనిట్లకు చేరడం గమనార్హం.
రికార్డు స్థాయిలో డిమాండ్
వ్యవసాయానికి పెరిగిన వాడకం
ఉష్ణోగ్రతలు పెరగడమూ కారణం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): శివరాత్రి రాకముందే పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగ డిమాండ్ పెరిగింది. వరి పొట్ట దశకు రాకముందే మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం పెరిగింది. నల్లగొండ జిల్లాలో విద్యుత్ రోజువారీ వినియోగం సగటున 16మిలియన్ యూనిట్లు కాగా, ఈనెల 12వ తేదీన 19మిలియన్ యూనిట్లకు చేరడం గమనార్హం.
శీతాకాలంలో చలి తీవ్రత పూర్తిగా తగ్గక ముందే ఉమ్మడి జిల్లా లో విద్యుత్ వినియోగం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. జనవరి మొదటి నెల నుంచే ఈ వినియోగం ప్రారంభమై ఫిబ్రవరి మొదటి వారానికి పతాక స్థాయికి చేరింది. యాసంగి పంటల సాగు ప్రారంభం కావడంతో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయిని దాటిం ది.రాష్ట్రంలో అత్యధికంగా బోరుబావుల ఆధారితంగా ఉమ్మడి జిల్లా లో పంటలు సాగవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో సుమారు 4.60 లక్షలఎకరాల్లో వరి సాగవుతుండగా, ఇప్పటికే 25శాతం మేర నాట్లు పూర్తయ్యాయి. దీనికితోడు నీటి ఆధారిత మెట్టపైర్ల సాగుపై రైతులు మక్కువ చూపించారు. ఇప్పుడే విద్యుత్ వాడకం ఇలా ఉంటే వరి పొట్టదశకు చేరే సరికి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.
పెరిగిన వినియోగం
నల్లగొండ జిల్లాలో 5,82,220 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందు లో 1,65,131 బోరుబావుల కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో సాధారణం గా రోజుకు 12.5మిలియన్ యూనిట్లు (ఎంయూ) వినియోగం జరుగుతుండగా, అందులో అధికంగా వ్యవసాయం, పరిశ్రమలకే 80 శా తం వాడకం ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తుండటంతో నిరుపయోగంగా ఉన్న బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. ఈ యాసంగిలో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ సైతం అమాంతం పెరిగింది. ఈనెల 10వ తేదీన 17ఎంయూ వినియోగం ఉండగా, రెండు రోజుల్లో ఈ నెల 12వ తేదీకి 19.48 ఎం యూకు చేరింది. ఈ నెల 10న 17.18 ఎం యూ, 11న 17.66, 12న 19.48ఎంయూ వినియోగమైంది. మూడేళ్లలో ఏనాడు 19.48మిలియన్ యూనిట్ల డిమాండ్ లేకపోవడం గమనార్హం. కాగా, యాదాద్రి జిల్లాలో 10న 8.9ఎంయూ, 11న 9.2, 12న 11.2ఎంయూ, సూర్యాపేట జిల్లాలో 10న 9.76, 11న 10.46, 12న 9.88 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది.
మొదలైన కరెంటు కష్టాలు
ఉమ్మడి జిల్లాలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. నిండు వేస వి రాకముందే విద్యుత్ కోతలు ప్రారంభమవడంతో భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు భావిస్తున్నారు. సగటున ఒక్కో జిల్లాలో 19.5మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ అధికారు లు చెబుతుండగా, కేవలం 16.5మిలియన్ల యూనిట్ల కంటే మించి సరఫరా కావడంలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 6.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహాలకు పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు విద్యుత్ కోత గంట పాటు విధిస్తు న్నా, మిగతా సమయాల్లో సరిపడా సరఫరా ఉం ది. అయి తే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి వేళాపాలా లేకుండా కోతలు విధిస్తున్నారు.
తరుచుగా మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు
లోవోల్టేజీ కారణంగా తరుచుగా విద్యుత్ మోటార్లు కాలడంతోపాటు, అధిక లోడుతో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 52వేలు ఉండగా, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 1.40లక్ష వరకు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో ఉన్నవాటిపై అధిక లోడ్ పడి మరమ్మతు లకు గురవుతున్నాయి.
రోడ్డెక్కుతున్న రైతులు
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం గా మారడంతో రైతులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి లో ఆ పరిస్థితి లేదు. కేవలం 12గంటలు మాత్రమే అది కూడా రెండు విడతల్లో సరఫరా అవుతోంది. రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజా ము 5వరకు, మధ్యాహ్నం 12గంటల నుంచి సాయం త్రం 4వరకు విద్యుత్ సరఫరా అవుతోంది. పండ్ల తోట లు మొదలు వరి తదితర పంటలకు సరిపడా నీరు అంద డం లేదు. విద్యుత్ కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నా, నిత్యం కోతలే అని రైతులు పేర్కొంటున్నారు. సాగర్ ఎడమ కా ల్వ కింద వాగుల్లో బోర్లు వేసుకున్నవారు అధికంగా విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు, పొలాల వద్దే పడిగాపులుకాసే పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో రైతులు స్వచ్ఛందంగా రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 10న ఒకే రోజు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 10 ప్రాంతాల్లో రైతులు ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి నిర్వహించారు. సోమవారం సైతం సీపీఎంతో పాటు పలు సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.
డిమాండ్ పెరిగినా ఇబ్బందులు లేవు : సీహెచ్.శంకరయ్య, నల్లగొండ డీఈ
మూడు రోజులుగా విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేవు. దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మున్నుందు రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు సరఫరా ఇచ్చేందుకు ఇప్పటికే విద్యుత్ కొనుగోలును ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో విద్యుత్ డిమాండ్(ఎంయూ), ఉష్ణోగ్రతలు ఇలా..
తేదీ నల్లగొండ యాదాద్రి సూర్యాపేట ఉష్ణోగ్రత
10 17.18 8.9 9.76 34.5
11 17.66 9.2 10.46 35.0
12 19.48 11.2 9.88 35.5
నల్లగొండ జిల్లాలో మూడేళ్లలో ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు విద్యుత్ డిమాండ్ ఇలా..
తేదీ 2021 2022 2023
10 18.20 15.30 17.18
11 18.47 16.62 17.66
12 18.15 16.60 19.48