Tarakaratna: తారకరత్న కన్నుమూత

ABN , First Publish Date - 2023-02-19T02:39:47+05:30 IST

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు.

Tarakaratna: తారకరత్న  కన్నుమూత

23 రోజులుగా మృత్యువుతో పోరాడి.. తుది శ్వాస

నేడు హైదరాబాద్‌లోని స్వగృహానికి పార్థివదేహం

రేపు సాయంత్రం 4 వరకూ ఫిలిం చాంబర్‌లో

తారకరత్న మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్‌ దిగ్ర్భాంతి

కేసీఆర్‌, పవన్‌కల్యాణ్‌, కిషన్‌రెడ్డి, రేవంత్‌ సంతాపం

బెంగళూరు/హైదరాబాద్‌/అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రముఖ న్యూరాలజిస్ట్‌, విదేశీ వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స కొనసాగించారు. గత రెండు రోజులుగా తారకరత్న ఆరోగ్యం జటిలమైనట్లు తెలుస్తోంది.

శనివారం ఉదయం పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత వెంటిలేటర్‌ తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్‌ తరలిస్తారంటూ శనివారం ప్రచారం సాగింది. కానీ, అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం రాత్రి ప్రకటించాయి. ఆయనకు మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలు ముందు నుంచీ ఉన్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి.అందువల్లే పాదయాత్రలో ఒత్తిడికిలోనై తారకరత్న గుండెపోటుకు గురయ్యారని పేర్కొన్నాయి. కాగా, తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తె నిషిక తొలిరోజు నుంచే ఆస్పత్రిలోనే ఉన్నారు.

రేపు అంత్యక్రియలు..

టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి 11గంటలకు తారకరత్న పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ నగర శివార్లలోని మోకిలలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం అక్కడే ఉంచి సోమవారం ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ప్రముఖుల సంతాపం..

నందమూరి తారకరత్న మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతిని, బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి దూరమై.. తమ కుటుంబానికి విషాదం మిగిల్చారన్నారు. తారకరత్న మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాగా, తారకరత్న కోలుకుంటారని భావించానని, కానీ.. మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. ‘బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు... నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది... నందమూరి తారకరత్న మృతి దిగ్ర్భాంతికి గురి చేసింది’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

‘‘తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు... నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహబంధం మన బంధుత్వం కంటే గొప్పది... తారకరత్నకు కన్నీటి నివాళులు’’ అని ఆయన పేర్కొన్నారు. తారకరత్న మృతి పట్ల ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యతు ఉన్న తారకతర్న చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన మరణం ఎన్టీఆర్‌ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-19T02:52:56+05:30 IST