Naveen Case: హరిహరకృష్ణ ప్రియురాలి అరెస్టు

ABN , First Publish Date - 2023-03-07T02:07:26+05:30 IST

సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ నవీన్‌ హత్య కేసులో.. నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక, స్నేహితుడు హసన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Naveen Case: హరిహరకృష్ణ  ప్రియురాలి అరెస్టు

మిత్రుడు హసన్‌ కూడా అదుపులో

హత్య సంగతి తెలిసినా దాచారు

తప్పించుకునేందుకు సాయం చేశారు

సాక్ష్యాల మాయానికి తోడ్పాటు

నిందితుడితో కలిసి హత్యా స్థలానికి

ఏ2గా హసన్‌, ఏ3గా నీహారిక

హైదరాబాద్‌ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ నవీన్‌ హత్య కేసులో.. నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక, స్నేహితుడు హసన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నవీన్‌ను హరిహర చంపేసిన విషయం తెలిసీ ఆ విషయాన్ని చెప్పకుండా దాచి, సాక్ష్యాలను మాయం చేయడంలో, నిందితుడు తప్పించుకోవడానికి సహకరించినందున.. ఏ2గా హసన్‌పై, ఏ3గా నీహారికరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎల్బీ నగర్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ సాయిశ్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి నేరుగా బ్రహ్మణపల్లి రాజీవ్‌స్వగృహ ఫేజ్‌-1లో ఉంటున్న స్నేహితుడు హసన్‌ ఇంటికి వెళ్లాడు. హత్య గురించి అతడికి చెప్పాడు. హసన్‌ హరిహరకు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు, రక్తపు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తన దుస్తులు ఇచ్చాడు. ఆరోజు రాత్రి హరిహర, హసన్‌.. ఇద్దరూ నవీన్‌ మృతదేహం వద్దకు వెళ్లి, శరీర భాగాలను బ్యాగ్‌లో తీసుకెళ్లి మన్నెగూడ శివార్లలో పడేసి వచ్చారు. తరువాత హసన్‌ ఇంట్లోని మొదటి అంతస్తులో అక్కడే 18న తెల్లవారుజాము వరకూ ఉన్నారు.

మర్డర్‌ స్పాట్‌కు నీహారిక..

18న ఉదయం హరిహరకృష్ణ.. హసన్‌ ఇంటి నుంచి హస్తినాపురంలోని నీహారిక వద్దకు వెళ్లాడు. వరంగల్‌ వెళ్లేందుకు డబ్బులు కావాలని అడగడంతో ఆమె రూ.1500 అతడికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. తరువాత నుంచి హరిహరకృష్ణ.. నిత్యం హసన్‌తో, నీహారికతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. నవీన్‌ హత్య సంగతి తెలిసిన హరిహర తండ్రి.. పోలీసులకు లొంగిపోవాలంటూ కుమారుడికి సూచించారు. కానీ, అతడు వరంగల్‌ నుంచి వైజాగ్‌ వెళ్లాడు. అక్కణ్నుంచీ 20వ తేదీ రాత్రి నగరానికి వచ్చి మళ్లీ నీహారికను కలిశాడు. ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని.. నవీన్‌ను హత్య చేసిన చోటుకు తీసుకెళ్లాడు. కొద్దిదూరం నుంచి అతడి మృతదేహాన్ని చూపించి.. హత్య ఎలా చేశాడో వివరించాడు. అక్కడి నుంచి వచ్చిన వీరిద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు.

శరీర భాగాలు తగలబెట్టి..

హరిహర కృష్ణ పోలీసులకు లొంగిపోడానికి ముందు.. హసన్‌తో కలిసి మన్నెగూడ శివార్లకు వెళ్లి, అక్కడ అంతకుముందు పడేసిన నవీన్‌ శరీర భాగాలను తీసుకుని, తిరిగి మర్డర్‌స్పాట్‌కు వచ్చారు. ఆధారాలను మాయం చేయాలన్న కోణంలో ఆలోచించి వాటిలో కొన్ని భాగాలను తగలబెట్టారు. అనంతరం నీహారిక ఇంటికి వెళ్లారు. అక్కడే స్నానం చేశారు. ఆ సమయంలో నీహారిక ఇంట్లోవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ‘ఆధారాలన్నీ మాయం చేశాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నేను లొంగిపోయి.. ఒక్కణ్నే ఈ హత్య చేశానని ఒప్పుకొంటా’ అని హరిహర వారికి ధైర్యం చెప్పాడు. అనంతరం 24న రాత్రి.. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు.

Updated Date - 2023-03-07T02:08:08+05:30 IST