మూడు రంగుల జెండా పట్టి.. ఎన్నో గుండెలను కొల్లగొట్టి!
ABN , First Publish Date - 2023-12-08T03:52:51+05:30 IST
‘‘మూడు రంగుల జెండాపట్టి.. సింగమోలే కదిలినాడు.. ఒక్కరో కాంగ్రెసూ సూరీడు.. మన రేవంతన్నా..
ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై పాటకు యువత ఉర్రూతలు
సభలు, ర్యాలీల్లో మోత.. కాంగ్రెస్ విజయంలో కీలకం
తెలంగాణతో పాటు ఏపీలోనూ కాలర్ ట్యూన్గా గీతం
రచయిత అర్జున్కు, గాయకుడు నల్లగొండ గద్దర్కు పేరు
హైదరాబాద్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘మూడు రంగుల జెండాపట్టి.. సింగమోలే కదిలినాడు.. ఒక్కరో కాంగ్రెసూ సూరీడు.. మన రేవంతన్నా.. నిగ్గదీసి అడిగే మొనగాడు’’ అంటూ సాగే పాట ఎన్నికల ప్రచారంలో ఎంత హిట్టయిందో తెలుసు కదా? ప్రచారం నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా అభిమాన లోకాన్ని ఓ ఊపు ఊపిన ఈ పాటకు ఓ సభలో ప్రియాంకా గాంధీ కూడా డ్యాన్స్ చేశారు. రేవంత్ రెడ్డి మీద రాసిన ఈ పాట.. బహిరంగసభలు, రోడ్ షోలు, ర్యాలీలు, సమావేశాల్లో మార్మోగింది. యువత కాలర్ ట్యూన్లుగానూ పెట్టుకొని మురిసిపోయారు. ‘ఈపాట నాకెంతో స్ఫూర్తినిచ్చింది’ అని సాక్షాత్తు రేవంత్ రెడ్డే స్పం దించారు! ఇంతలా గొప్ప ఆదరణ పొందిన ఈ పాటను పాడిందెవరో తెలుసా? ‘నల్లగొండ గద్దర్’గా పేరుగాంచిన కాసల నర్సన్న అనే గాయకుడు. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా గుండ్రపల్లి. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు పాటలు పాడటంలో నర్సన్న పేరొందారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లతోపాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, బీజేపీ నేతలు ఈటల, రఘునందన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేతలెందరికో నర్సన్న తన గొంతు అందించారు.
అయితే ఇప్పటిదాకా ఈయన పాడిన పాటలను మరిపించేలా ‘మూడు రంగుల జెండా పట్టి..’ పాట ఆదరణ పొందింది. 3:40 నిమిషాల నిడివిగల ఈ పాటను నల్లగొండ జిల్లాకే చెందిన సినీ సంగీత దర్శకుడు, గేయ రచయిత చరణ్ అర్జున్ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక పర్యటించిన ప్రతీచోటా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖమ్మం బహిరంగసభలో ప్రియాంక గాంధీ ఈ పాటకు చప్పట్లు చరుస్తూ ప్రజలను ఉత్సాహపరుస్తూ డ్యాన్స్ చేశారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ యువత ఈ పాటను తమ ఫోన్లలో కాలర్ ట్యూన్లుగా పెట్టుకోవడం విశేషం. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి... పాట గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న స్వగ్రామం గుండ్రపల్లికి వెళ్లి ఈ పాట గురించి ప్రస్తావించారు. ఈ పాట తనకు చాలా స్పూర్తి ఇచ్చిందన్నారు. నర్సన్న, 2009 వరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దగ్గర కారు డ్రైవరుగా పనిచేశారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఐదో తరగతి నుంచి గద్దర్ పాటలు వింటూ పెరిగాననని, బాల్యం నుంచే తాను ఆయనలా పాడుతూ ఉండటంతో తనకు ‘నల్గొండ గద్దర్’ పేరు వచ్చిందని నర్సన్న చెప్పారు.