వేద విద్యా కేంద్రం ఏర్పాటుకు 20 కోట్ల సాయం చేయండి
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:22 AM
వసుదైక కుటుంబ నిర్మాణమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి వేద విద్యా కేంద్రానికి రూ.20 కోట్ల ఆర్థికసాయం చేయాలని సీఎం రేవంత్రెడ్డిని భువనగిరికి చెందిన మాజీ డీఎస్పీ దొమకొండ నళిని కోరారు.
సీఎం రేవంత్కు మాజీ డీఎస్పీ నళిని విజ్ఞప్తి
హైదరాబాద్, భువనగిరి టౌన్ (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 30: వసుదైక కుటుంబ నిర్మాణమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి వేద విద్యా కేంద్రానికి రూ.20 కోట్ల ఆర్థికసాయం చేయాలని సీఎం రేవంత్రెడ్డిని భువనగిరికి చెందిన మాజీ డీఎస్పీ దొమకొండ నళిని కోరారు. తెలంగాణ ఉద్యమంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని తిరిగి సర్వీ్సలోకి తీసుకుంటామని సీఎం ఇటీవల ప్రకటించగా.. ఉద్యోగం వద్దు తానెంచుకున్న ఆధ్యాత్మిక మార్గానికి సాయం చేయాలని ఇటీవల ఫేస్బుక్ ద్వారా సీఎంకు లేఖ రాసిన ఆమె శనివారం ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమె యోగక్షేమాలను, ఉద్యోగానికి రాజీనామా చేసిన పరిస్థితులు, తదనంతరం ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనకు జరిగిన అన్యాయం, ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ రాసిన 16 పేజీల లేఖ, ఒక వినతిపత్రాన్ని ఆమె సీఎంకు అందజేశారు. సమాజంలో తిరిగి వేద పఠనంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మహర్షి మిషన్లో భాగంగా అక్షరధామ్, లోటస్ టెంపుల్ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి వేదవిద్యా కేంద్రం ఏర్పాటుకు సంకల్పించినట్లు తెలిపారు. కేంద్రంలో వేద గురుకులం కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు 3 భాషల్లో యూట్యూబ్ చానళ్లు నడుపుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు ఆమె వేద గ్రంథాలు అందజేశారు. ఆమె వెంట విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆధ్యాత్మిక గురువు ధర్మవీర్ ఉన్నారు.