త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

ABN , First Publish Date - 2023-06-26T02:57:05+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని, త్వరలోనే వారికి ప్రభుత్వం నుంచి శుభవార్త అందుతుందని టీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు.....

త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

జీతాలు పెంచే యోచనలో సీఎం..

నెలలో ఉద్యోగ భద్రతపై నివేదిక..

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి

భద్రాచలం, జూన్‌ 25: ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని, త్వరలోనే వారికి ప్రభుత్వం నుంచి శుభవార్త అందుతుందని టీఎ్‌సఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. జీతాలు ఎంత పెంచాలనే దానిపై చర్చ నడుస్తోందని, తప్పకుండా వారికి అనువుగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. బాజిరెడ్డి ఆదివారం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు రెండు పీఆర్సీలు ఇవ్వాల్సి ఉందని, ఒక పీఆర్సీ ఇచ్చే ఆలోచన ఉందని, ఇందుకు ప్రభుత్వంపై రూ.480 కోట్ల భారం పడుతుందన్నారు. నష్టాల్లోనే నడుస్తున్న సంస్థను ఏ విధంగా గట్టెక్కించాలని ఆలోచిస్తున్నామన్నారు. గతంలో ఆర్టీసీని అమ్మేస్తారని, లేదా ప్రైవేటీకరణ చేస్తారనే అపోహలు ఉండేవని, కానీ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని బతికిస్తారనే విశ్వాసాన్ని ఉద్యోగుల్లో కలిగించారన్నారు. రూ.1,500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడమే కాకుండా మరో రూ.1,500కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీ ఇచ్చిందన్నారు. ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి బాగా కష్టపడుతున్నారని అభినందించారు. ప్రతిపక్షాలు రెచ్చగొడుతూ ఉంటాయని వారి మాటలు వినొద్దని సూ చించారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కోసం నియమించిన కమిటీ నివేదిక నెల రోజుల్లో వస్తుందని తెలిపారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 95 డిపోలు తీవ్ర నష్టాల్లో ఉండేవని, తాము బాధ్యతలు చేపట్టిన అనంతరం 50డిపోలు లాభాలవైపు పయనిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా రోజు కు రూ.9 నుంచి రూ.10 కోట్లు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం రూ.16 నుంచి రూ.20 కోట్ల వరకు సమకూరుతోందని తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాలతో అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ఒడిశా రాష్ట్ర అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.

Updated Date - 2023-06-26T02:57:05+05:30 IST