టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ‘ఫ్రీడమ్ డే’ ఆఫర్
ABN , First Publish Date - 2023-08-14T02:44:41+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు అందిస్తోంది.
సిటీలో రూ.75కే టి-24 టికెట్.. రూ.50కి పిల్లల టి-24
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్ను కేవలం రూ.75కు, పిల్లలకు టి-24 టికెట్ను రూ.50కే అందించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టికెట్ చార్జీల్లో 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ కేవలం స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ మంగళవారం ఒక్క రోజు మాత్రమే ఉంటుందని టీఎ్సఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా వసూలు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన స్ర్తీ, పురుషులు రాయితీ కోసం ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్కు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున హైదరాబాద్లో పర్యాటక ప్రాంతాలు, పార్కులను సందర్శించేందుకు అనువుగా టి-24టికెట్పై రాయితీని ప్రకటించినట్లు పేర్కొన్నారు.