Eleti Maheshwar Reddy : బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నేత ఏలేటి

ABN , First Publish Date - 2023-04-14T04:10:26+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీ ,..

Eleti Maheshwar Reddy : బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నేత ఏలేటి

న్యూఢిల్లీ/నిర్మల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌, నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అఽధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపిన గంటకే మహేశ్వర్‌ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌తో కలిసి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలుసుకున్నారు. ఛుగ్‌, బండి శాలువాతో ఏలేటిని సత్కరించి ఆహ్వానించారు. వీరంతా కలిసి నడ్డా నివాసానికి వెళ్లారు. మహేశ్వర్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాంగ్రె్‌సలోకి ఉడుములా వచ్చిన ఒక వ్యక్తి సీనియర్లను ఇబ్బంది పెడుతూ పార్టీని వీడేలా పనిచేస్తున్నాడన్నారు. కాంగ్రె్‌సలో నిత్యం ఎదురవుతున్న అవమానాలు, అనుమానాలతో ముందుకు సాగడం కష్టమని భావించి రాజీనామా చేసినట్టు తెలిపారు. బీజేపీలో చేరాలని రెండేళ్లుగా ఈటల, బండి సంజయ్‌ అడుగుతున్నారని చెప్పారు. కారణం లేకుండా షోకాజ్‌ నోటీసులు ఇచ్చి గంటలోపే సమాధానం చెప్పాలనడం భూ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. తనపై సోషల్‌ మీడియాలో నిందలు మోపారని, ఏం జరిగిందో తెలియదు కానీ తనను బయటకు పంపించాలని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కలిసి అడుగులు వేస్తున్నాయని, అందుకు పార్లమెంటు సమావేశాలే నిదర్శనమన్నారు. సంజయ్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. మహేశ్వర్‌ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కలిపిస్తామన్నారు.ఈటల మాట్లాడుతూ నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన చాలామంది సీనియర్‌ నేతలు బీజేపీలో చేరతారని చెప్పారు. కాగా, సాయంత్రం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సంజయ్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కొనేందుకు పెడదామనుకున్న డబ్బులతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను తెరిపించాలన్నారు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆ డబ్బు ఖర్చు చేయాలన్నారు.

Updated Date - 2023-04-14T04:10:27+05:30 IST