ముడుపులిచ్చినోళ్లకే..
ABN , First Publish Date - 2023-07-21T02:39:26+05:30 IST
నిన్న దళిత బంధు, నేడు బీసీ బంధు.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభిస్తున్న ఏ పథకమైనా ముందుగా దళారుల జేబులు నింపేందుకే ఉపయోగపడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘బీసీ బంధు’కు భారీగా వసూళ్లు
ఒక్కొక్కరి నుంచి రూ.20-30 వేలు
కుల వృత్తుల్లో లేని వారి పేర్లూ జాబితాలోకి..
ఒక్క కుటుంబం నుంచే ఏకంగా ఐదుగురి పేర్లు
ఆసిఫాబాద్ జిల్లాలో మండలస్థాయి నేతల దందా
తుది జాబితా బయటకు పొక్కడంతో వివాదాస్పదం
జాబితా లీక్పై కలెక్టర్ సీరియస్.. రహస్య విచారణ
ఆసిఫాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): నిన్న దళిత బంధు, నేడు బీసీ బంధు.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభిస్తున్న ఏ పథకమైనా ముందుగా దళారుల జేబులు నింపేందుకే ఉపయోగపడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాసులు చెల్లించినోళ్లకే సం‘క్షేమం’ అందుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయో... ఇప్పుడు బీసీ బంధులోనూ అదే తంతు మొదలైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తాజాగా ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో 300 మందికి బీసీ బంధు ఇచ్చేలా జాబితాలను సిద్ధం చేశారు. ఈనెల 15న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావాల్సిఉన్నా.. ఆసిఫాబాద్ జిల్లాలో వాయిదా పడింది. అయితే, దీని వెనుక భారీ తతంగమే నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వం నిర్దేశించినట్టుగా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా ప్రాధాన్యం అనే విషయాన్ని విస్మరించి.. ఇష్టారీతిన లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం వివాదాస్పదమవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే ఒక నియోజకవర్గానికి చెందిన జాబితాలో ఒక్క కుటుంబం నుంచే ఐదుగురి పేర్లు కనిపించడం దుమారం రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నేతలతోపాటు బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు ఉన్నారన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేలకు సన్నిహితులుగా చెప్పుకుంటున్న కొంత మంది నాయకులే ఈ వసూళ్ల పర్వానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివిధ మండలాల్లో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20 నుంచి రూ.30వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యం గా ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి మండలాల్లో స్థానికంగా ఉండని వారి పేర్లు జాబితాలో దర్శనమిచ్చాయి. కులవృత్తుల్లో లేని కొన్ని కుటుంబాలకు కూడా జాబితాలో చోటు దక్కడం వెనుక ముడుపుల పర్వమే కారణమని భావిస్తున్నారు.
బయటకు వచ్చిందిలా!
ఇదే వ్యవహారంపై జిల్లా పరిషత్ స్టాండింగ్ కమి టీ సమావేశం సందర్భంగా అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అధికారులను నిలదీయడం తో అక్రమ వసూళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒకవర్గం ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఈ అక్రమాల తతంగాన్ని బయట పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాబితా లీకేజీలపై విమర్శలు చుట్టుముట్టడంతో కలెక్టర్ దీన్ని సీరియ్సగా తీసుకొని విచారణకు ఆదేశించటం గమనార్హం. పోలీసు యంతారంగం రహ స్య విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అధికారులపై వేటుకు రంగం సిద్ధం..
జాబితా లీకు వ్యవహారంపై సంబంధిత అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పథకంలో ఆసిఫాబాద్ జిల్లాకు మొత్తం 600 యూని ట్లు మొదటిదశలో మంజూరయ్యాయి. ఇందులో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 300, సిర్పూరు నియోజకవర్గానికి 300యూనిట్ల చొప్పున కేటాయించారు. జిల్లా లో మొత్తం 5,558 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వడపోతల ద్వారా 551 మందితో ఆసిఫాబాద్ నియోవకవర్గ తుది జాబితాను తయారు చేశారు. ఆన్లైన్లో ఉండాల్సిన ఈ జాబితాలు బహిర్గతం కావడంతో జాబితాలో చోటు దక్కని లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్నారు. దీనికి బాధ్యులైన బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఆ శాఖ కమిషనర్కు కలెక్టర్ హేమంత్ బొర్కడే ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.