Food delivery boys : ఫుడ్ డెలివర్రీ బాయ్స్
ABN , First Publish Date - 2023-05-26T03:37:51+05:30 IST
రాష్ట్రంలో 4.25 లక్షల మంది గిగ్ వర్కర్ల కష్టాలు పట్టని ప్రభుత్వం అందని సంక్షేమ పథకాలు.. 4 ఏళ్లలో ప్రమాదాల్లో 120 మంది మృతి

రాష్ట్రంలో 4.25 లక్షల మంది గిగ్ వర్కర్ల కష్టాలు పట్టని ప్రభుత్వం
అందని సంక్షేమ పథకాలు.. 4 ఏళ్లలో ప్రమాదాల్లో 120 మంది మృతి
రాజస్థాన్లో సర్కారు అండ.. 8 గంటల పని, బీమా, ఉద్యోగ భద్రత
యూసు్ఫగూడలోని ఓ అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ చేద్దామని వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్ ముహమ్మద్ రిజ్వాన్(25)ను డాబర్మన్ కుక్క వెంబడించింది. తప్పించుకునే ప్రయత్నంలో మూడో అంతస్తు నుంచి కిందపడి, మరణించాడు. తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లను పోషిస్తున్న రిజ్వాన్ మరణంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నుంచి గానీ, స్విగ్గీ నుంచి గానీ ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు.
స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న రాజు అనే 31 ఏళ్ల యువకుడు ఈనెల 6న అల్వాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్న రాజు మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇతడి కుటుంబానికి స్విగ్గీ కంపెనీ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదు.
(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్)
వారు 24 గంటలూ సేవలందిస్తారు.. కానీ, ఉద్యోగులు కాదు. నిరంతరం శ్రమించే కార్మికులు.. కానీ, అసంఘటిత రంగం పరిధిలోకి రారు. ఉద్యోగ భద్రత ఉండదు.. కనీస వేతనాలు లెక్కల్లోకే రావు..! బీమాలు, ఉద్యోగ భద్రత, భవిష్యనిధి మాట అటుంచితే.. రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్య కారణాలతోనో చనిపోతే కుటుంబాలు రోడ్డుపాలవుతాయి. అంతేతప్ప.. ప్రభుత్వాలో, పనిచేస్తున్న సంస్థలో ఆదుకోవు. ఇదీ.. ఫుడ్ ఆర్డర్ చేయగానే నిమిషాల్లో డెలివరీ చేసే గిగ్ వర్కర్స్ దుస్థితి. వీరేకాదు.. ర్యాపిడో, ఓలా, ఊబర్ సంస్థల తరఫున ద్విచక్రవాహనాలపై ప్యాసింజర్లను తీసుకెళ్లేవారు, ఈ-కామర్స్ సంస్థల తరఫున హోండెలివరీలు చేసేవారు కూడా గిగ్ వర్కర్స్ పరిధిలోకి వస్తారు. గిగ్ వర్కర్ల సేవలతో వినియోగదారులు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండానే, అన్ని సేవలను పొందుతున్నారు. వీరు పనిచేసే సంస్థలు, వాటితో ఒప్పందాలు చేసుకున్న రెస్టారెంట్ల యాజమాన్యాలు కూడా ఆర్డర్లు ఎంత పెరిగితే.. అంతలా లబ్ధి పొందుతాయి. అంతేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రూపేణా కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కానీ, వీరి ఉద్యోగాలకు, ప్రాణాలకు భద్రతకు మాత్రం ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. నాలుగేళ్లలో 120 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ విధి నిర్వహణలో ఉండగా.. రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు ఆ సంఘాలు చెబుతున్నాయి.
కేంద్రం ఆదేశించినా..
స్విగ్గి, జొమాటో, డుంజో, బ్లింకిట్, ర్యాపిడో, ఓలా, ఊబర్.. వంటి సంస్థల్లో తాత్కాలిక ఉపాధి అవకాశాలు పొందేవారిని ‘గిగ్’ వర్కర్స్ అంటారు. రాష్ట్రవ్యాప్తంగా 4.25 లక్షల మంది ఇలా ఉపాధి పొందుతుండగా.. వీరిలో 3లక్షలకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, సొంత వాహనం ఉంటే చాలు.. ఈ సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నించి, విసిగిపోయిన చాలా మంది ఫుడ్ డెలివరీని ఎంచుకుంటున్నారు. దేశంలో ఇలాంటి గిగ్ వర్కర్ల సంఖ్య 85 లక్షలుగా ఉండగా.. 2030 నాటికి 4 కోట్లు దాటుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దాంతో.. వారి భద్రతకు, సంక్షేమానికి చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది ‘సోషల్ సెక్యూరిటీ కోడ్’ను సిద్ధం చేసింది. దాన్ని అమలు చేయాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కోడ్ ప్రకారం ప్రభుత్వాలు ప్రతి ఫుడ్ డెలివరీ 2% లెవీని వసూలు చేయాలి. ఆ నిధులను ఫుడ్ డెలివరీ బాయ్స్ సంక్షేమానికి వెచ్చించాలి.
రాజస్థాన్లో ఇలా..
కేంద్రప్రభుత్వం పేర్కొన్న సోషల్ సెక్యూరిటీ కోడ్ను రాజస్థాన్ రాష్ట్రం మాత్రమే అమలు చేస్తోంది. అక్కడ 3 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉండగా.. ‘రాజస్థాన్ ప్లాట్ఫాం బేస్డ్ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ను ప్రకటించి, రూ.200 కోట్ల నిధులను కేటాయించింది. ప్రతి ఫుడ్ డెలివరీ, ట్యాక్సీ/బైక్ రైడ్కు 1ు లెవీ విధిస్తున్న ప్రభుత్వం, ఆ నిధులను వెల్ఫేర్ ఫండ్లో జమ చేస్తోంది. ఆ ఫండ్ ఆధారంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. రాజస్థాన్ ప్రభుత్వ స్కీమ్ ముసాయిదా రూపకల్పనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలావుద్దీన్ కూడా ఉన్నారు. ఈయన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ప్రత్యేక చట్టం చేయాలి: సలావుద్దీన్
గిగ్ ప్లాట్ఫాం రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని షేక్ సలావుద్దీన్ ఆరోపించారు. డెలివరి బాయ్స్ సహాయంతో రూ.కోట్లలో లాభాలు గడిస్తున్న కంపెనీలు.. వారి భద్రతను పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో డెలివరీ అందించాలన్న తాపత్రయంలో గిగ్ వర్కర్లు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, గిగ్ వర్కర్స్ సంక్షేమానికి రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.