Share News

కేంద్ర పథకాలకు నిధులపై దృష్టి సారించండి

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:27 AM

కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటాగా రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయించుకోవడానికి ప్రణాళికలు తయారుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

కేంద్ర పథకాలకు నిధులపై దృష్టి సారించండి

చేనేత పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారుచేయాలి

మార్కెట్లలో వసతులు కల్పించండి

అధికారులతో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటాగా రావాల్సిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయించుకోవడానికి ప్రణాళికలు తయారుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి, మార్కెటింగ్‌ శాఖలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును గ్రీన్‌ఫీల్డు పార్కుగా పరిగణించాలని కేంద్ర జౌళి శాఖ కార్యదర్శికి లేఖ రాయాలని నిర్ణయించారు. టెస్కో, హ్యాండిక్రాఫ్ట్‌, చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌, పవర్‌ లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఒకే రకమైన కార్యకలాపాలు చేస్తున్నట్లయితే అన్నిటిని కలిపేందుకు ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు. గద్వాల, పోచంపల్లి చేనేత పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను ఈ ఆర్థిక సంవత్సరం(మార్చి నెలాఖరు) వరకు కొనసాగించడానికి కావాల్సిన బడ్జెట్‌ లెక్కల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కోహెడ పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి మొదటి దశలో సుమారు రూ. 400 కోట్లతో ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో... జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలించి మోడల్‌గా తయారుచేయాలని సూచించారు. మార్కెట్‌ స్థలం ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో రైతులకు, వ్యాపారులకు వసతులు సమకూర్చాలని ఆదేశించారు.సమావేశంలో వీసీ అండ్‌ ఎండీ అలుగు వర్షిణి, మార్కెటింగ్‌, జౌళిశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 03:27 AM