ఈవీఎం.. ప్రస్థానం..
ABN , First Publish Date - 2023-11-06T04:05:22+05:30 IST
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది.
1982లో కేరళలోని పరవూర్లో ప్రారంభం
2013లో వీవీ ప్యాట్ అందుబాటులోకి..
హైదరాబాద్ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది. విశిష్టమైన ఈ ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పలు సంస్కరణలు చేపడుతోంది. ఈ క్రమంలోనే 42 ఏళ్ల క్రితం ఎలక్ర్టానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన లేమి, సాంకేతిక సమస్యల వల్ల ఎన్నికల కమిషన్ అధికారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం, బ్యాలెట్లపై వేసిన ఓట్లను లెక్కించడం కష్టతరమైన తరుణంలో ఈవీఎంల ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బ్యాలెట్ పద్ధతిని పాటిస్తుండగా, ఇతర అన్ని ఎన్నికలకు ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 2013లో వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) అనే అత్యాధునిక యంత్రాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఓటు ఎవరికి పడిందో సరిచూసుకునే అవకాశం ఇందులో కల్పించారు.
ఈవీఎం వినియోగ క్రమమిదీ..
1982 మే19: కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు.
1983: వివిధ రాష్ట్రాల్లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాలకు ఈ మెషీన్లను వాడారు.
1984 మార్చి 5: సాంకేతిక సమస్యల వల్ల ఈవీఎంలను వాడొద్దని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
1988 డిసెంబరు: కేంద్ర ప్రభుత్వం ఈవీఎంల అవసరాన్ని గుర్తిస్తూ సెక్షన్ 61ఏ ద్వారా చట్టంలో చేర్చింది.
1989 మార్చి 15: కేంద్ర ప్రభుత్వ సవరణ అమల్లోకి వచ్చింది. సుప్రీం కోర్టు ఈవీఎంల వినియోగాన్ని సమర్థించింది.
1990 జనవరి: ఎన్నికల సంస్కరణల కమిటీ సిఫారసుల మేరకు ఏప్రిల్లో ఈవీఎంల వాడకాన్ని తగ్గించారు.
1992 మార్చి 24: పలు సవరణలతో ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
1999-2004: పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో వీటిని మళ్లీ వాడారు.
2013 అక్టోబరు 8: దశలవారీగా వీవీ ప్యాట్లను వినియోగించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.