KishanReddy: ఈటల రాజేందర్‌.. బీజేపీని వీడే ప్రశ్నే లేదు

ABN , First Publish Date - 2023-06-01T03:46:41+05:30 IST

తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన ఈటల రాజేందర్‌ పార్టీని వీడే ప్రశ్నే లేదని కేంద్ర మంత్రి కిషన రెడ్డి స్పష్టం చేశారు.

 KishanReddy: ఈటల రాజేందర్‌.. బీజేపీని వీడే ప్రశ్నే లేదు

ఈ ప్రచారం వెనుక బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుట్ర

చట్ట ప్రకారమే పార్లమెంట్‌ స్థానాల పునర్విభజన

క్షిణాదికి అన్యాయం జరుగుతుందనడం సరి కాదు

ఏక్‌ భారత- శ్రేష్ట్‌ భారత.. మా నినాదం: కిషన రెడ్డి

న్యూఢిల్లీ, మే 31(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన ఈటల రాజేందర్‌ పార్టీని వీడే ప్రశ్నే లేదని కేంద్ర మంత్రి కిషన రెడ్డి స్పష్టం చేశారు. అదంతా బేస్‌లెస్‌, రాంగ్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు మళ్లీ వెళ్లిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కుటుంబంలో చేరిన వారెవరూ అలా చేయరని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలే ఈ కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం కిషనరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరేందుకు వెనుకాడుతున్నారన్న వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ... నాయకులు చేరినంత మాత్రాన గెలవమని, ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పారు. బీజేపీలో చేరిన వారంతా పార్టీలో ఉన్నారని, ఉంటారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, రానున్న రోజుల్లో తమ పార్టీ మరింత బలపడుతుందని స్పష్టం చేశారు.

అవినీతి, నియంతృత్వ ప్రభుత్వం, కుటుంబ పాలన పోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ 20 రాషా్ట్రల్లో ఓడిపోయింది. ఒక్క కర్ణాటకలో గెలిచినంత మాత్రాన ఆ పార్టీకి కొమ్ములు వస్తాయా? మేము 25 రాష్ట్రాల్లో గెలిచాం. కర్ణాటకలో ఓడిపోయినంత మాత్రాన డీలా పడతామా?’’ అని ప్రశ్నించారు. కాగా, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కిషన రెడ్డి స్పందిస్తూ.. అది రాజ్యాంగ బద్ధ ప్రక్రియ అని, కొత్తగా తాము ఎలాంటి చట్టమూ చేయడం లేదని గుర్తు చేశారు. గతంలో చేసిన చట్టం ప్రకారమే పునర్విభజన జరుగుతుందని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనడం సరికాదని అన్నారు. ఏక్‌ భారత-శ్రేష్ట భారత నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఆధ్వర్యంలో గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడంతోపాటు సాయుధ బలగాల పరేడ్‌ నిర్వహించనున్నట్లు కిషనరెడ్డి తెలిపారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ‘ఖిలా ఔర్‌ కహానీ’ థీమ్‌తో పాఠశాల స్థాయిలో పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సహకారాన్ని వివరిస్తూ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-06-01T04:00:59+05:30 IST