Drug detection : డ్రంకెన్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:58 AM
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తుపదార్థాలు తీసుకుంటే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షల(లాలాజల పరీక్ష)తో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీ-న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
లాలాజలంతో పట్టేస్తాం.. పాజిటివ్గా తేలితే డీ-అడిక్షన్ కేంద్రాలకు
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో టీ-న్యాబ్.. సినీపరిశ్రమ, పబ్లపై దృష్టి
డ్రగ్స్, గంజాయిపై 8712671111కు చెప్పండి: సందీప్ శాండిల్య
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తుపదార్థాలు తీసుకుంటే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షల(లాలాజల పరీక్ష)తో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీ-న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ అనలైజర్లతో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్లుగానే.. డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు ప్రత్యేక పరికరాలను తెప్పిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘యాంటీ నక్సల్స్ వింగ్ గ్రేహౌండ్స్, యాంటీ టెర్రరిజం వింగ్ ఆక్టోపస్ మాదిరిగానే.. బలమైన యాంటీ డ్రగ్స్ వింగ్గా టీ-న్యాబ్ను తీర్చిదిద్దుతున్నాం. అందుకు అవసరమైన వనరులు, పరికరాలు, మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటున్నాం. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగానే.. ధైర్య సాహసాలతో, రాజీలేని పోరాటం చేసే యోధులతో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం. అందుకు తగ్గట్లుగానే ఈ విభాగం సిబ్బందికి జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, పదోన్నతులు ఉంటాయి’’ అని వివరించారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సీఎస్, డీజీపీలతో కలిసి రెండున్నర గంటలపాటు డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సందీప్ శాండిల్య.. తమ దృష్టిని ఐటీ, సినీ పరిశ్రమలు, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, రిసార్ట్లపై సారించామన్నారు. త్వరలో కొత్త సంవత్సరం వేడుకలు జరగనున్నందుకు రేవ్పార్టీలు, రిసార్ట్లపై నిఘా పెట్టినట్లు వివరించారు. ‘‘డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతూనే.. యువత పెడదోవ పట్టకుండా వారికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. స్కూళ్లు మొదలు.. విశ్వవిద్యాలయాల దాకా ‘యాంటీ డ్రగ్స్ కమిటీ’లను ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బోధనేతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సైకాలజిస్టులు(కౌన్సిలర్లు/డీ-అడిక్షన్ నిపుణులు), హాస్టళ్ల వార్డెన్లు, పోలీసులు ఉంటారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సదస్సులు, సెమినార్లు, కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు. డ్రగ్స్ డిటెక్షన్ టెస్టుల్లో పట్టుబడేవారిని నేరుగా డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ‘‘అంతేకాదు.. ఎవరి మీదైనా అనుమానం వస్తే.. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తాం. డ్రగ్స్ తీసుకున్న మూణ్నెల్ల వరకు ఈ పరీక్షలను నిర్వహించవచ్చు. టేబుల్టా్పలు, డోర్ హ్యాండిల్స్, వాష్బేసిన్లు, జేబులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు.. ఇలా ఎక్కడైనా నానోగ్రామ్ పరిమాణంలో డ్రగ్స్ ఆనవాళ్లున్నా.. వాటిని ప్రత్యేక పరికరాల ద్వారా గుర్తిస్తాం’’ అని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని, పెడ్లర్లపై ముప్పేటదాడులు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు. డ్రగ్స్ దందాలో అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పారు.
ఎలా గుర్తిస్తారు?
ఆల్కహాల్ సేవించిన వారిని బ్రీత్ అనలైజర్లతో గుర్తించినట్లే.. డ్రగ్స్ సేవించిన వారిని గుర్తించేందుకు అనేక పరికరాలున్నాయి. పలు దేశాలు, స్పోర్ట్స్ అథారిటీలు ‘డ్రాగర్ డ్రగ్ టెస్ట్-5000’ అనే పరికరాన్ని విరివిగా ఉపయోగిస్తున్నాయి. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కూడా ఈ తరహా పరికరాన్ని తెప్పిస్తోంది. కొవిడ్-19 పరీక్ష సమయంలో లాలాజలాన్ని నమూనాగా తీసుకున్నట్లే.. ఇక్కడ కూడా ఉమ్మిని సేకరిస్తారు. ఆ నమూనాను డ్రాగర్ పరికరానికి అందజేయగానే.. డ్రగ్స్ శాంపిల్స్ ఉన్నాయా? లేదా? అనే ఫలితం తేలిపోతుంది. ఒకవేళ డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తే.. అది ఏ రకమైన ఉత్ర్పేరకం? అనేదాన్ని ఆధారాలతో నిర్ధారిస్తుంది. అంటే.. యాంఫెటమైన్, డిజైనర్ యాంఫెటమైన్, ఓపియాట్స్, కొకైన్, మెటబాలైట్స్, బెంజోడియజెఫైన్, గంజాయి, మెథాడోన్.. ఇలా ఏ రకమైన డ్రగ్ను సేవించారో తేల్చిచెబుతుంది. ఈ ఆధారాలు కోర్టుల్లో సాక్ష్యాలుగా పనిచేస్తాయి.