Share News

యాదాద్రికి పోటెత్తిన భక్తులు!

ABN , First Publish Date - 2023-12-11T04:03:54+05:30 IST

పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసం ముగుస్తుండటం, సెలవు రోజుతో పాటు స్వాతి నక్షత్రం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి నృసింహుడిని దర్శించుకున్నారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తులు!

ఒక్కరోజే దర్శించుకున్న 60 వేలకు పైగా మంది

ఆలయ ఖజానాకు రూ.1.09 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట, డిసెంబరు 10: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసం ముగుస్తుండటం, సెలవు రోజుతో పాటు స్వాతి నక్షత్రం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి నృసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సుమారు 60 వేలకు పైగా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ఒక్కరోజే 1,594 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో పాల్గొన్నారు. స్వామి జన్మనక్షత్రం పురస్కరించుకుని స్వాతి జన్మనక్షత్రోత్సవాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. హోమ పూజలు చేపట్టి గర్భాలయంలో కొలువుదీరిన మూలవర్యులను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ అష్టోత్తర శత కలశాలతో అభిషేకించారు. అనంతరం ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి అధిక సంఖ్యలో వెళ్లాల్సిరావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. యాదాద్రీశుడిని ఏపీ రవాణ, సమాచారశాఖ మంత్రి విశ్వరూప్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇక ఆలయ ఖజానాకు ఒక్కరోజే రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరింది. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలు, వాహనాల ప్రవేశాలు, ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఆలయ ఖజానాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-12-11T07:26:46+05:30 IST