అరబిందో ఫార్మాలో ప్రమాదం

ABN , First Publish Date - 2023-06-02T02:45:35+05:30 IST

బాచుపల్లిలోని అరబిందో ఫార్మా యూనిట్‌-2లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది.

అరబిందో ఫార్మాలో ప్రమాదం

ముగ్గురి పరిస్థితి విషమం

నిజాంపేట్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): బాచుపల్లిలోని అరబిందో ఫార్మా యూనిట్‌-2లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. సాల్వెంట్‌ లీకై అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఏడుగురు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. తోటి కార్మికులు వెంటనే ఆ ఏడుగురిని సమీపంలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో సాల్వెంట్‌ ప్రాసెసింగ్‌ విభాగంలో ముగ్గురు కార్మికులు రసాయన మిశ్రమం కలుపుతున్నారు. ఆ సమయంలో సాల్వెంట్‌ లీకై బయటకు రావడంతో ఒక్కసారిగా గ్యాస్‌ విడుదలై ముగ్గురు కార్మికులు స్పృహ తప్పి ఆ యూనిట్‌లో పడిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన మరో నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని అంబులెన్స్‌లో ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కె.శ్రీనివాస్‌ రావు, జె.గౌరి, ఎ.విమల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చికిత్స అందిస్తున్న వైద్యుడు తెలిపారు. మరో నలుగురు ఎన్‌. గౌరీనాఽథ్‌, ప్రేమ్‌కుమార్‌, ప్రసాద్‌రాజు, యాసంఅలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలాన్ని బాచుపల్లి సీఐ సుమన్‌ సందర్శించారు.

Updated Date - 2023-06-02T02:45:35+05:30 IST