నిషేధిత పత్తి విత్తనాల పట్టివేత
ABN , First Publish Date - 2023-06-02T02:36:25+05:30 IST
కోళ్ల మేత పేరుతో నిషేధిత బీటీ-3 విత్తనాలను విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను ఎల్బీనగర్ ఎస్వోటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.70 లక్షల విలువైన బీటీ సీడ్స్ స్వాధీనం
చౌటుప్పల్ కేంద్రంగా దందా.. ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ సిటీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): కోళ్ల మేత పేరుతో నిషేధిత బీటీ-3 విత్తనాలను విక్రయిస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను ఎల్బీనగర్ ఎస్వోటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద దాదాపు రూ.70 లక్షల విలువైన 2.2 టన్నుల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా మైలవరం ప్రాంతానికి చెందిన రావి ప్రసన్న కుమార్(42).. 10 ఏళ్లుగా నవత ఆగ్రో డివిజన్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ పేరుతో చౌటుప్పల్లో విత్తనాలు, పురుగుమందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఏపీకి చెందిన గడ్డం రవీంద్రబాబు(29) పరిచయమయ్యాడు. రవీంద్రబాబు మహారాష్ట్రలోని నాగపూర్కు సమీపంలోని 60 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇతడికి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నరసింహులు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్నాడు. వీటిని రవీంద్రబాబు ఏపీ, మహారాష్ట్రలో ఏజెంట్లను నియమించుకొని సరఫరా చేస్తున్నాడు. రవీంద్రబాబు నుంచి ప్రసన్నకుమార్ నిషేధిత పత్తి విత్తనాలను కొనుగోలు చేసి, చౌటుప్పల్ పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. దందాపై అనుమానం వచ్చిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. వ్యవసాయ అధికారులు, చౌటుప్పల్ పోలీసులతో కలిసి ప్రసన్నకుమార్ గోదాంపై దాడి చేశారు. రవీంద్రబాబు, ప్రసన్న కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ విక్రయానికి సిద్ధంగా ఉంచిన 2.2 టన్నుల నిషేధిత బీటీ- 3 పత్తి విత్తనాలతోపాటు, కియా కారు స్వాధీనం చేసుకున్నారు.