కిక్కిరిసిన కీసరగుట్ట
ABN , First Publish Date - 2023-12-10T22:47:30+05:30 IST
భక్తులతో కీసరగుట్ట కిక్కిరిసింది. కార్తీకమాసోత్సవం సందర్భంగా ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యల్లో ఆలయానికి విచ్చేశారు.
శివలింగాలకు అభిషేకాలు
కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు
కీసర, డిసెంబరు10: భక్తులతో కీసరగుట్ట కిక్కిరిసింది. కార్తీకమాసోత్సవం సందర్భంగా ఆదివారం సెలవురోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యల్లో ఆలయానికి విచ్చేశారు. ఈ మేరకు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆలయానికి రద్దీ పెరిగింది. దీంతో సర్వ దర్శనారికి దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పట్టింది. శీఘ్ర దర్శనానికి టిక్కెటు కొనుగోలు చేసిన భక్తులకు రెండుగంటల వరకు క్యూలో ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు గర్భాలయంలోని మూలరాట్కు భక్తులు శ్రీమహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించగా, భక్తులరద్దీ దృష్ట్యా అభిషేకాలను నిలిపివేసి కేవలం దర్శనాలకే అనుమతి ఇచ్చారు. ఆలయం వెలుపల లక్ష్మీ నరసింహ్మస్వామిని, శివపంచాయతనం, సీతారామచంద్రస్వామిలను దర్శించుకున్న భక్తులు శివలింగాలకు అభిషేకాలు చేశారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వన భోజనాలు ఆచరించారు. పిల్లలు ఆట, పాటలతో సందడి చేశారు.