ఆందోళనలు.. ఆత్మహత్యాయత్నాలు!
ABN , First Publish Date - 2023-05-26T04:20:33+05:30 IST
అన్నదాతల కష్టాలు తీరడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై వారి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని..

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కొనసాగుతున్న రైతుల నిరసనలు..
మెదక్ జిల్లా శివ్వంపేటలో అన్నదాత ఆత్మహత్యాయత్నం
● రోడ్డు ప్రమాదంలో రైతు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
● ప్రైవేటుగా వడ్లు అమ్మాలని మిల్లుకు వెళ్తుండగా ఘటన
● క్వింటాకు ఐదు కిలోల దోపిడీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
అన్నదాతల కష్టాలు తీరడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై వారి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని.. తాలు, తరుగు కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని సర్కారు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారటం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరులో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం రోడ్డుపై కుప్పగా పోసి తగులబెట్టి రాస్తారోకో చేశారు. వారం రోజులు దాటినా ధాన్యం కాంటా వేయలేదని నిరసన వ్యక్తం చేశారు. చివరకు తహసీల్దార్ పాల్సింగ్ హామీతో ఆందోళన విరమించారు. ఇటు మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతు ముత్తగల్ల రవితేజ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న బీజేపీ కార్యకర్తలు, డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్లు అడ్డుకొని నీరు పోయడంతో ప్రమాదం తప్పింది. కాంటా అయిన ధాన్యం తరలించడానికి వాహనాలు లేక నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్లు రవితేజ ఆవేదన చెందాడు. ఇటు లారీల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్లో రైతులు రోడ్డెక్కారు. తూకం వేసిన ధాన్యం కాపాడుకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ, వైఎస్సార్టీపీ నాయకులు మద్దతు పలికారు.