పోటాపోటీగా వేడుకలు
ABN , First Publish Date - 2023-06-02T02:35:00+05:30 IST
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం తాము పోషించిన పాత్రను చెప్పుకుంటూ పోటాపోటీగా కార్యక్రమాలను చేపడుతున్నాయి.
దశాబ్ది ఉత్సవాల్లో ఎవరి జెండా వారిదే
రాష్ట్ర ఏర్పాటులో తామే కీలకమంటూ ప్రధాన పార్టీల ప్రచారం
హైదరాబాద్/కార్వాన్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం తాము పోషించిన పాత్రను చెప్పుకుంటూ పోటాపోటీగా కార్యక్రమాలను చేపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తామే తెలంగాణ తెచ్చామంటూ ప్రభుత్వం తరఫున ఉత్సవాలను నిర్వహిస్తోంది. పనిలో పనిగా ప్రభుత్వ ఖర్చుతో భారీగా ప్రకటనలిచ్చి పార్టీకి ప్రయోజనకరంగా మార్చుకునే పనిలో ఉంది. పత్రికల్లో ప్రకటనలు, కార్యక్రమాల కోసం ప్రభుత్వం నుంచి వందలకోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చుచేస్తోంది. పార్టీ-ప్రభుత్వం అనే హద్దులు చెరిపేసి బీఆర్ఎస్సే తెలంగాణ చాంపియన్ అన్న పేరు తెచ్చుకుని వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ప్రాతిపదికను ఏర్పాటు చేసుకోవాలనే అంతర్గత లక్ష్యంతో ఉంది. పనిలో పనిగా ఈ ఉత్సవాల ముసుగు లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా మరిపించేలా కార్యక్రమాలను రూపకల్పన చేసింది. మరోవైపు అధికార పక్షంలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండానే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా దానికి ధీటుగానే కొన్ని కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని పేర్కొంటోంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా దెబ్బతింటామని తెలిసి కూడా నాడు తెలంగాణ ఇవ్వాలనే సాహసోపేత నిర్ణయాన్ని సోనియాగాంధీ తీసుకుందని గుర్తుచేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన నాటి లోక్సభకు స్పీకర్గా ఉన్న మీరాకుమార్ను రాష్ట్రానికి తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ కూడా తెలంగాణ రావడంలో తమ పాత్రను ప్రముఖంగానే చెప్పేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. నాటి ఉద్యమకారులకు చిన్నమ్మగా చిరపరిచితమైన దివంగత సుష్మాస్వరాజ్ పోషించిన పాత్రను మళ్లీ గుర్తుచేయనుంది. అంతేకాకుండా ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేంద్రానికి మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతోంది. మరోవైపు నాడు ఉద్యమానికి నాయకత్వం వహించి, తెలంగాణ జేఏసీకి కన్వీనర్గా ఉన్న కోదండరాం, ఇతర పార్టీలు కూడా వేటికవే కార్యక్రమాలు చేపడుతున్నాయి. మొత్తంగా ఈ 21 రోజులు తెలంగాణ తెచ్చిందెవరు? ఇచ్చిందెవరు? అన్నదానిపై జోరుగానే చర్చకు తెరతీయాలని ఏ పార్టీకాపార్టీ అజెండాలను సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఉదయం 7.10 గంటలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయుు. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో దేశభక్తి పాటలు.. ఆనంద్ శంకర్, మంజుల రామస్వామి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు.. మంగ్లీ, మధుప్రియల గీతాలాపన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.
కాగా, పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన నాటి లోక్సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహే్షకుమార్ గౌడ్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్లో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. అనంతరం గన్పార్క్ వద్ద మీరాకుమార్తోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరులకు నివాళులర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత నిజాం కాలేజీ సమీపంలో ఉన్న బాబు జగ్జ్జీవన్రామ్ విగ్రహం నుంచి గాంధీభవన్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం గాంధీ భవన్లో నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రజలకు రేవంత్ శుభాకాంక్షలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం.. సోనియాగాంధీ కరుణతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున వేడుకలు జరపాలని పిలుపునిచ్చారు. కాగా అమెరికా బయలుదేరి వెళ్లిన రేవంత్రెడ్డికి జేకేఎఫ్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.