Kumaram Bheem Asifabad: చేలల్లోనే పత్తి
ABN , Publish Date - Dec 26 , 2023 | 10:12 PM
తిర్యాణి మండలంలో కూలీలు దొరకక పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చేలకే పరిమితం అవుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తిర్యాణి, డిసెంబరు 26: తిర్యాణి మండలంలో కూలీలు దొరకక పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట చేలకే పరిమితం అవుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పత్తి పంట అధికంగా సాగు చేయడంతో కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంట చేతికందే సమయంలో ఆకాశం మేఘావృతం అవుతూ ఉండడంతో అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ సంవత్సరం దిగుబడి అంతంత మాత్రమే ఉండడంతో పాటు ధరలు కూడా తక్కువగా చెల్లిస్తూ ఉండడంతో పత్తి రైతులు పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదేమోనని ఆవేద వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొత్త మంది రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను తరలించి తమ పత్తి పంటను తీస్తున్నారు. కిలో ఒక్కంటికి 10 నుంచి 15 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. అయినప్పటకీ కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది బహిరంగ మార్కెట్లో పత్తి ధర రూ.10 వేలు పలికింది. కాగా ఈ ఏడాది 6,000 నుంచి 6,500 రూపాయల వరకు విక్రయించాల్సి వస్తుందని సదరు రైతులు వాపోతున్నారు.