మాజీ ఎమ్మెల్యే షకీల్ రైస్మిల్లుల్లో తనిఖీలు
ABN , Publish Date - Dec 17 , 2023 | 04:19 AM
నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందిన రైస్మిల్లులపై జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు.
సుమారు రూ.70 కోట్లకు పైగా కుంభకోణం!
అప్పగించాల్సిన 34వేల క్వింటాళ్ల ధాన్యం మాయం
ఒక్కరోజు తనిఖీలోనే రూ.9 కోట్ల అవినీతి బహిర్గతం
రెండ్రోజుల పాటు కొనసాగనున్న దాడులు
బోధన్ రూరల్/కోటగిరి, డిసెంబరు 16: నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందిన రైస్మిల్లులపై జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. రెండ్రోజుల తనిఖీల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన సోదాల లెక్కల మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పరంగా మొత్తంగా రూ.70 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు అంచనాకు వచ్చారు. జిల్లాలో సీఎంఆర్ లక్ష్యం చేరడం గగనంగా మారింది. సీఎంఆర్ గడువు ముగిసినా రైస్మిల్లులు నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఫలితంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు రైస్మిల్లుల తనిఖీలు నిర్వహిస్తూ ధాన్యం వివరాలు సేకరిస్తున్నారు. షకీల్ బంధువుల రైస్మిల్లులపై జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, జిల్లా మేనేజర్ జగదీశ్ తనిఖీలు చేపట్టారు. సాలూర మండలంలోని తగ్గేల్లి రైస్మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే షకీల్ తన రైస్మిల్లులకు గత 6 సీజన్లలో కలిపి లక్షలాది క్వింటాళ్ల ధాన్యం అలాట్మెంట్ చేయించారు.
సీఎంఆర్ నిర్ణీత గడువులోగా బియ్యం సివిల్ సప్లయ్, ఎఫ్సీఐలకు పంపాల్సి ఉంది. మిల్లులకు కేటాయించిన ధాన్యంలో ఇప్పటివరకు 50,732 క్వింటాళ్ల బియ్యాన్ని అప్పగిచారు. ఇంకా అప్పగించాల్సి ఉంది. శనివారం ధాన్యం నిల్వలకు సంబంధించిన గోదాంలలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లిన అధికారులకు తాళాలు కనిపించాయి. తాళాలు పగులగొట్టి అధికారులు లోనికి ప్రవేశించి చూడగా ధాన్యం నిల్వలు కనిపించకపోవడంతో అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. సుమారు 34వేల క్వింటాళ్ల ధాన్యం రైస్మిల్లులో లేకపోవడంతో రూ.70 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక్కరోజు తనిఖీలోనే సుమారు రూ.9కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. రెండ్రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్ వెల్లడించారు.