బొడ్రాయి ఉత్సవాల్లో కుల వివక్ష!
ABN , First Publish Date - 2023-09-07T04:06:01+05:30 IST
వట్టినాగులపల్లిలో బొడ్రాయి పండగ సందర్భంగా తలెత్తిన కుల వివక్ష వివాదం మరింత తీవ్రమైంది. దళితులపైన ఆగ్రకులాల దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో గాయపడిన దళితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
దళితులపై అగ్రకులాల దాడి
వట్టినాగులపల్లి గ్రామంలో ఉద్రిక్తత
రాయదుర్గం,సెప్టెంబర్ 6(ఆంధ్రజ్యోతి): వట్టినాగులపల్లిలో బొడ్రాయి పండగ సందర్భంగా తలెత్తిన కుల వివక్ష వివాదం మరింత తీవ్రమైంది. దళితులపైన ఆగ్రకులాల దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో గాయపడిన దళితులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వట్టినాగులపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగను నిర్వహించారు. బొడ్రాయికి గ్రామంలోని అన్నికులాల వాళ్లు బోనాలు సమర్పించడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బోనాలు సమర్పించేందుకు దళితులు వెళ్తుండగా అగ్రకులాల వారు అడ్డుకున్నారు. దీనిని దళిత యువకులు ప్రశ్నించగా, వారిపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో నార్సింగ్ మున్సిపల్ చైర్మన్, ఆమె భర్త, ఇతర రాజకీయ నాయకులు అక్కడ ఉండటంతో ఇరువర్గాలను శాంతపరిచి పంపించి వేశారు. అయితే, నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయాక గ్రామంలోని అగ్రకులాలకు చెందిన వారు దళిత యువకులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు అక్కడికి వచ్చేలోపే గ్రామంలోని ఇరు వర్గాలకు చెందిన వందలాదిమంది పరస్పరం దాడులు చేసుకుంటూ ఉండటంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉండటంతో సుమారు వందమంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడులకు పాల్పడినవారు పరారవడంతో వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసే పనిలో పోలీసులు ఉన్నారు.