మోదీ తరఫున ప్రచారం చేయండి

ABN , First Publish Date - 2023-09-04T04:18:38+05:30 IST

ప్రవాస భారతీయులు ప్రధాని మోదీ పట్ల చూపుతున్న అభిమానం హర్షణీయమని, ఆయన తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

మోదీ తరఫున ప్రచారం చేయండి

మీ అభిమానాన్ని ఓటు రూపంలో చూపండి

ప్రవాస భారతీయులతో బండి సంజయ్‌

బీజేపీ నుంచి యెన్నం సస్పెండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రవాస భారతీయులు ప్రధాని మోదీ పట్ల చూపుతున్న అభిమానం హర్షణీయమని, ఆయన తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం అట్లాంటాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించాలని కోరారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఎన్నారైలను కోరారు. అవినీతికి తావులేకుండా పాలన కొనసాగుతోందని, అభివృద్ధిలో భారత్‌ ప్రపంచ దేశాల్లో నంబర్‌ వన్‌గా నిలవాలంటే మళ్లీ మోదీ ప్రభుత్వం రావాలని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, దేశం కోసం ఆలోచించే వారే ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానానికి మద్దతు ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.వి.సుభా్‌ష స్పష్టం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీలతో పాటు వాటికి పరోక్షంగా సహకరిస్తున్నవారే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కాగా, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2023-09-04T04:18:38+05:30 IST