ఎఫ్సీఐకి నెలాఖరులోగా సీఎంఆర్ అందించాలి
ABN , First Publish Date - 2023-03-05T03:38:12+05:30 IST
మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా మార్చి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ ) నిర్దేశించినట్లుగా ఈ నెల 31 వరకు అందించాలని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు.
పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్
హైదరాబాద్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)గా మార్చి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ ) నిర్దేశించినట్లుగా ఈ నెల 31 వరకు అందించాలని పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం అన్ని జిల్లాల మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంతో వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2021-22 రబీకి సీఎంఆర్ ఇంకా 12.61 లక్షల టన్నులు రావాల్సి ఉందన్నారు. మిల్లర్లు రోజుకు 50 వేల టన్నుల మేర బియ్యాన్ని అప్పగిస్తే లక్ష్యం చేరుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఒక షిఫ్ట్ ప్రకారం పనిచేస్తే 45 వేల టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేయొచ్చన్నారు.
ఎఫ్సీఐకి ముడి బియ్యం అందించే విషయంలో సమస్యలు ఉండొచ్చు కానీ.. బాయిల్డ్ రైస్ అందించడానికి మిల్లర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. మిల్లర్లు సమయానికి బియ్యం ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో 95 వేల టన్నుల బాయిల్డ్ రైస్ ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉండగా, 31 వేల టన్నులు మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీశారు. నిజామాబాద్, మహబూబ్నగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా సీఎంఆర్ పెండింగ్ ఎక్కువ ఉందన్నారు. కాగా, హైదరాబాద్ కవాడిగూడలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రవీందర్సింగ్ ప్రారంభించారు.