సార్పై భారం
ABN , First Publish Date - 2023-03-05T00:39:00+05:30 IST
పదోతరగతి పరీక్షలు మరో నెలరోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలపై జిల్లాయంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గతంలో కంటే ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగుతులు కూడా నిర్వహిస్తోంది.
విద్యాశాఖకు ఇన్చార్జీలే దిక్కు
జిల్లాలో రెండేళ్లుగా ఇన్చార్జీ డీఈవోనే
హెచ్ఎంలు లేక కొరవడిన పర్యవేక్షణ
ఏ ఒక్క మండలానికీ ఎంఈవో లేరు
సమీపిస్తున్న పదో తరగతి పరీక్షలు
ఆందోళనలో విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): పదోతరగతి పరీక్షలు మరో నెలరోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలపై జిల్లాయంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గతంలో కంటే ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగుతులు కూడా నిర్వహిస్తోంది. అయితే జిల్లాలో పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారి లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.
డీఈవోగా పనిచేసిన చైతన్య జైనీ 2021 అక్టోబరులో బదిలీపై వెళ్లా రు. ఆమె స్థానంలో నల్లగొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 2021 అక్టోబరు నుంచి 2022 జూన్ వరకు నరసింహ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్థానంలో వరంగల్ డైట్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న కె.నారాయణరెడ్డికి జూలై నుంచి అదనపు బాధ్యతలను అప్పగించింది. కీలకమైన విద్యాశాఖకు శాశ్వత డీఈవోను నియమించిన పక్షంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతోపాటు సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం మార్గం చూపే అవకాశం ఉంటుంది. ఇన్చార్జీ అధికారి ఉం డడంతో రెండు శాఖలకు సమన్యాయం చేయాల్సి ఉంటుంది. గురువా రం బీబీనగర్ మండలంలోని పలు జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలను ఇన్చార్జీ డీఈవో కె.నారాయణరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. విధుల్లో అలసత్వం వహించిన నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. నగరానికి చేరువలో ఉన్న బీబీనగర్ మండలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాల్లో ఎలాగుంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో డీఈవోపాటు డిప్యూటీ డీఈవోలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అయితే ప్రభుత్వం డిప్యూటీ డీఈవో పోస్టులను రద్దు చేయడంతో, వారి బాధ్యత ఎంఈవోలపై పడింది.
జిల్లాలో మొత్తం 712 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో మొత్తం 17 మండలాల్లో 712 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 481, ప్రాథమికోన్నత పాఠశాలలు 68, ఉన్నత పాఠశాలలు 163 ఉన్నాయి. 17 మండలాల్లోనూ శాశ్వత ఎంఈవోలు లేకపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 163 జీహెచ్ఎం పోస్టులకు కేవలం 73మంది మాత్రమే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 90 పాఠశాలల్లో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లే ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులుగా అదనపు బాధ్యతలు స్వీకరించిన స్కూల్అసిస్టెంట్లు తరగతిలో ఆశించిన మేరకు పాఠ్యాంశాలు బోధించడంలేదు. పాఠశాలల పర్యవేక్షణతోనే కాలం గడిచిపోతోంది. దీంతో విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో వెనుకబడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖలో పూర్తిస్థాయి పర్యవేక్షణ అధికారులతోనే సమస్యలకు పరిష్కారం మార్గం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
625 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
జిల్లాలో మొత్తం 3,465 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 2,840 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మరో 625 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో పలు సబ్జెక్టు ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీ పోస్టులు కూడా భారీగానే ఖాళీ ఉన్నాయి. దీంతో పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులను విద్యాశాఖ సర్దుబాటు చేసింది. జిల్లాలో 50 స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటుచేసి, విద్యా ప్రమాణాల బాఽధ్యతను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. అయితే వారికి అవసరమైన సిబ్బందిన మాత్రం ఏర్పాటు చేయలేదు. సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది.
ఐదు నెలలుగా గిరిజన శాఖ అధికారి పోస్టు ఖాళీ..
ప్రభుత్వం పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన, గిరిజనేతరులకు పట్టాలు పంపిణీ చేసేందు కు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు భూముల సర్వేలతోపాటు రైతుల వారీగా వివరాల సేకరణ పూర్తయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా గిరిజన శాఖ అధికారి పోస్టుల ఖాళీగా ఉం ది. గతంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారిగా పనిచేసిన మంగ్తానాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన స్థానంలో జిల్లా యంత్రాంగం డీఆర్డీవో ఉపేందర్రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. డీఆర్డీవో శాఖ కీలకమైంది. ఉపాధి కూలీలతోపాటు స్వ యం సహాయక సంఘాల గ్రూపుల రుణాల మంజూరుతో పాటు ఇతర పథకాలపై నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో డీఆర్డీవోపై అదనపు పనిభారం పడింది. ప్రస్తుతం జిల్లాలో పోడు భూములు లబ్ధిదారుల ఎంపికతోపాటు గిరిజన సంక్షేమ హాస్టళ్లపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు హాస్టల్ వార్డెన్లపై నిరంతరం పర్యవేక్షించాలి. మరోవైపు పలు మండలాల్లో పోడు రైతులు హద్దుల పంచాయతీతోపాటు పట్టాల పంపిణీకి అర్హుల జాబితా కీలకంగా మారింది. ఈ శాఖకు శాశ్వత అధికారిని నియమిస్తే పర్యవేక్షణ సులువుగా ఉంటుందని పలువురు గిరిజన నేతలు కోరుతున్నారు.