మద్యం తాగించి.. బండరాయితో మోది...యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2023-07-21T03:01:31+05:30 IST

తాను ప్రేమించే యువతిని మరొకరు కూడా ప్రేమిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. పార్టీ అని పిలిచి మద్యం తాగించి బండరాయితో తలపై మోది..

మద్యం తాగించి.. బండరాయితో మోది...యువకుడి దారుణ హత్య

ఓ యువతి కోసం మరో యువకుడి ఘాతుకం

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో ఘటన.. నలుగురి అరెస్టు

కొత్తూర్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): తాను ప్రేమించే యువతిని మరొకరు కూడా ప్రేమిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. పార్టీ అని పిలిచి మద్యం తాగించి బండరాయితో తలపై మోది.. తనకు అడ్డుగా ఉన్న యువకుడి ప్రాణం తీశాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మున్సిపాలిటీ పరిధి తిమ్మాపూర్‌లో జరిగిన ఈ హత్య కేసులో ఇద్దరు మైనర్లు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. బిహార్‌కు చెందిన రాజ్‌కఫిల్‌ సాహు(20) స్టేషన్‌ తిమ్మాపూర్‌లో నివాసముంటూ హెచ్‌ఐఎల్‌ పరిశ్రమలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే అదే ప్రాంతంలో ఉంటున్న బిహార్‌కే చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొత్తూర్‌లో నివాసముంటున్న బిహార్‌కు చెందిన రాహుల్‌సింగ్‌(21) కూడా అదే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, ఆ యువతి తనకు దక్కదనే ఆలోచనతో సాహును చంపాలని స్నేహితులతో కలిసి రాహుల్‌ ఓ పథకం వేశాడు. దాని ప్రకారం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని చెప్పి సాహును మంగళవారం(18వ తేదీ) సాయంత్రం పిలిచాడు. అందరూ కలిసి తిమ్మాపూర్‌ పరిసరాల్లో ఓ వెంచర్‌లోకి వెళ్లి మద్యం తాగారు. అనంతరం రాహుల్‌, అతని స్నేహితులు బీరు సీసాలతో సాహుపై దాడి చేశారు. ఆపై బండరాయితో తలపై మోదారు. దీంతో సాహు చనిపోగా మృతదేహాన్ని అక్కడే ఉంచి మట్టితో కప్పేసి పారిపోయారు. అయితే, సాహు కనిపించకపోవడంతో తోటి కార్మికులు కాంట్రాక్టర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలోనే ఓ వెంచర్‌లో గుర్తు తెలియని శ వం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అది సాహుగా గుర్తించారు. ఆపై, సాహు తోటి కార్మికుల సమాచారంతో రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన దారుణం బయటికొచ్చింది.

Updated Date - 2023-07-21T03:01:39+05:30 IST