బీఆర్ఎస్, కాంగ్రెస్వి అలవిగాని హామీలు
ABN , First Publish Date - 2023-09-22T03:04:46+05:30 IST
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అలవిగాని హమీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు,
ప్రభుత్వ భూములమ్మి రుణమాఫీ చేస్తున్నారు: ఈటల
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అలవిగాని హమీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్తో పాటు వితంతు పెన్షన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్లే కేసీఆర్ తన హామీలను నెరవేర్చలేక పోతున్నారని అన్నారు. గతంలో ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు కేసీఆర్ ఓకే చెప్తేనే పెన్షన్ వచ్చే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట, రింగురోడ్డు వద్ద ప్రభుత్వ భూములు విక్రయించడం, మద్యం దుకాణాల టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తామిచ్చే హామీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.