బీజేపీ, బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం!
ABN , First Publish Date - 2023-06-26T02:26:27+05:30 IST
ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసొచ్చిన తెలంగాణ నేతలు ఎలాంటి భ్రమలూ పెట్టుకోవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.....
షా, నడ్డాను కలిసొచ్చిన బీజేపీ నేతలూ ఎలాంటి భ్రమలు పెట్టుకోకండి
మీ ఢిల్లీ పెద్దలు, కేసీఆర్ ఒక్కటే.. మాతో రండి.. కేసీఆర్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం
ఈటల, రాజగోపాల్రెడ్డికి రేవంత్ పిలుపు.. ఐటీ దాడుల్లో రహస్య ఆస్తులు దొరికాయ్
మీడియాలో రాకుండా చూసిన కేటీఆర్.. ఆ ఆస్తుల కోసమే మోదీకి లొంగిపోయిన కేసీఆర్
100 కోట్ల స్కాంలో కేజ్రీని విచారిస్తున్నారు.. లక్ష కోట్లు దోచిన కేసీఆర్ను విచారించరేం?
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసొచ్చిన తెలంగాణ నేతలు ఎలాంటి భ్రమలూ పెట్టుకోవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎ్సది దృఢమైన బంధమని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆదివారం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాను కలిసొచ్చిన తెలంగాణ బీజేపీ నాయకులు ఎలాంటి భ్రమలూ పెట్టుకోవద్దు. బీజేపీ, బీఆర్ఎ్సది ఫెవికాల్ బంధం. మీరు అనుకుంటే తెగిపోయేది కాదు. మీరు ఎంత చెప్పినా.. అక్కడ మీ మాట ఎవరూ వినరు. ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా మీకు జవాబు రాదు. మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే కాంగ్రెస్ పార్టీనే ఏకైక ప్రత్యామ్నాయం! మీరంతా మాతో కలిసి రండి! కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం’’ అని పిలుపునిచ్చారు. అమిత్ షా, జేపీ నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి భేటీ నేపథ్యంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ఆయన ఢిల్లీ పర్యటన కంటోన్మెంట్ రోడ్లు, మెట్రో రైలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కానేకాదని, కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనేనని ఆరోపించారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, అవి మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని అన్నారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారన్నారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ను ఎవరూ నమ్మరని చెప్పారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్.. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే దుస్థితికి తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్కు ఇష్టమైన ప్రాంతం దుబాయి అని, దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని అన్నారు. రూ.100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్పై విచారణ జరిపిస్తున్న ప్రధాని మోదీ.. రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు విచారించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.