ఈటలకు నోటీసులు

ABN , First Publish Date - 2023-04-07T04:41:43+05:30 IST

టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో నోటీసుల పరంపర కొనసాగుతోంది.

ఈటలకు నోటీసులు

ఇద్దరు పీఏలకూ అందజేసిన పోలీసులు

10న విచారణకు హాజరవుతా: రాజేందర్‌

మేడ్చల్‌, కమలాపూర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో నోటీసుల పరంపర కొనసాగుతోంది. బీజేపీలో కీలకనేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కమలాపూర్‌ పోలీసులు గురువారం సాయం త్రం నోటీసులు అందజేశారు. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ మండలం పూడూరు ఓఆర్‌ఆర్‌ పక్కనే గల ఈటల నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం ఉదయం 11గంటలకు వరంగల్‌ డీసీపీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈటలతో పాటు ఆయన ఇద్దరు పీఏలు రాజు, నరేందర్‌లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో తనకు నోటీసులు అందాయని, ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో తాను ఈ నెల 7న విచారణకు హాజరు కాలేనని, ఈనెల 10న ఉదయం 11గంటలకు హాజరవుతానని ఈటల పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, తనకు వాట్సాప్‌ వాడటం రాదని, ఫోన్‌ వస్తే మాట్లాడటం తప్ప తన కేమీ తెలియదని ఈటల తెలిపారు. తాను వాట్సాప్‌ మెసేజ్‌లు ఓపెన్‌ చేయనని, తనకేదైనా అత్యవసర సమాచారం వస్తే తన పీఏలే చూస్తారని చెప్పారు.

Updated Date - 2023-04-07T04:41:43+05:30 IST