ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసేందుకు యత్నం
ABN , First Publish Date - 2023-03-18T03:46:09+05:30 IST
పేదలకు డబుల్బెడ్ రూంల ఇళ్లు మంజురు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నాయకులు శుక్రవారం ఉదయం మేడ్చల్-మల్కాజ్గిరిజిల్లా, ఘట్కేసర్ మండలం, అవుషాపూర్లో గుడిసెలు వేసేందుకు యత్నించారు.

సీపీఎం నాయకుల అరెస్టు ఫఐదుగురిపై కేసు నమోదు
ఘట్కేసర్ రూరల్, మార్చి 17: పేదలకు డబుల్బెడ్ రూంల ఇళ్లు మంజురు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నాయకులు శుక్రవారం ఉదయం మేడ్చల్-మల్కాజ్గిరిజిల్లా, ఘట్కేసర్ మండలం, అవుషాపూర్లో గుడిసెలు వేసేందుకు యత్నించారు. ఉదయం సీపీఎం నాయకులు అవుషాపూర్ రెవెన్యూపరిధి సర్వేనెంబర్ 96లోని ఐదుఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసేందుకు వచ్చారు. భూమిలో ఉన్న రాళ్ళతో పాటు చెట్లపొదలను చదును చేసి 60 గజాలలో గుడిసెలు వేసేందుకు హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఘట్కేసర్ సీఐ అశోక్రెడ్డి పోలీసుసిబ్బందితో పాటు, డిప్యూటీ తహసీల్దారు భాస్కర్రెడ్డి రెవెన్యూ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుడిసెలు వేయడానికి ఏర్పాటు చేసిన హద్దులను తొలగించారు. అనంతరం డీసీఎంలో ఆందోళనకారులను కీసర, మేడిపల్లి పోలీసుస్టేషన్లకు తరలించారు. మల్కాజ్గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేష్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని గుడిసెలు వేసేందుకు వచ్చిన గ్రామస్థులను అక్కడి నుంచి పంపించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకొని సీపీఎం నాయకులను అదుపులోకి తీసుకొని, నార్కెట్పల్లి సబిత, నాగమణి, శోభ, అలివేలు, చింతల యాదయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.