అర్హత లేని అధికారికి పదోన్నతా ?
ABN , Publish Date - Dec 29 , 2023 | 03:22 AM
తెలంగాణ సమాచార మరియు పౌర సరఫరాల శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అదనపు సంచాలకుడిగా ఉన్న ఎల్ఎల్ఆర్ కిశోర్బాబుకు డైరెక్టర్గా పదోన్నతి కల్పించడంపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి సమాచార శాఖ ఉద్యోగుల ఫిర్యాదు
హైదరాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సమాచార మరియు పౌర సరఫరాల శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అదనపు సంచాలకుడిగా ఉన్న ఎల్ఎల్ఆర్ కిశోర్బాబుకు డైరెక్టర్గా పదోన్నతి కల్పించడంపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంకేతిక విభాగానికి చెందిన ఉద్యోగికి నిబంధనలకు విరుద్ధంగా కల్పించిన ఈ పదోన్నతిని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉద్యోగ సంఘం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డిసెంబరు 16న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. సమాచార శాఖలో ఏపీఆర్వో నుంచి డైరెక్టర్ వరకు ప్రతి అధికారికి పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజం డిగ్రీలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యార్హతలు లేకున్నా కిశోర్ బాబు అడ్డదారిలో పదోన్నతి పొందారని ఆరోపించారు. ఏపీకి చెందిన కిశోర్బాబుకు పదోన్నతి ఇవ్వడంతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కిశోర్ బాబుపై ఇప్పటికే సీబీసీఐడి, విజిలెన్స్ కేసులు ఉన్నాయని తెలిపారు. అంతేకాక తెలంగాణకు చెందిన అధికారి డైరెక్టర్గా ఉండగానే ఆ పోస్టు ఖాళీగా ఉందని కిశోర్బాబు కోర్టును ఆశ్రయించారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి పొందిన ఆయనకు తక్షణమే రివర్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.