డ్రగ్స్ కేసులో మరో దర్శకుడు, రచయిత అరెస్టు
ABN , First Publish Date - 2023-09-25T04:31:34+05:30 IST
డ్రగ్స్ కేసులో మాదాపూర్ పోలీసులు దర్శకుడు మంతెన వాసు వర్మ, సినీ రచయిత మన్నేరి పృథ్వీకృష్ణను అరెస్టు చేశారు.
మాదాపూర్లో చిక్కిన వాసు వర్మ, పృథ్వీకృష్ణ.. 70 గ్రాముల కొకైన్, గంజాయి స్వాధీనం!
ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ వద్ద వీరిద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తింపు
ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు, డైరెక్టర్ అరెస్టు.. నవదీప్ను ప్రశ్నించిన నార్కోటిక్ అధికారులు
అతనికి 81 మందితో అనుమానాస్పద లింకులు!.. నేడు కలహర్రెడ్డి, రవి, సూర్యల విచారణ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ కేసులో మాదాపూర్ పోలీసులు దర్శకుడు మంతెన వాసు వర్మ, సినీ రచయిత మన్నేరి పృథ్వీకృష్ణను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్తో పాటు పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో నిర్మాత కేవీ చౌదరిని జూన్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే నెలలో మరో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో వ్యాపారవేత్త కూడా అయిన వాసు వర్మ, పృథ్వీకృష్ణ నిందితులు. వాసు వర్మ ‘బస్తీ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను పరారీలో ఉండటం, డైరెక్టర్ అనే విషయం పెద్దగా తెలియకపోవడంతో ఈ కేసు ఫోకస్ కాలేదు. వీరిద్దర్నీ మాదాపూర్ పోలీసులు 20 రోజుల క్రితం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ అశోక్ వద్ద వీరిద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు గోప్యంగా ఉంచడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పలువురు నిర్మాతలు, యువ దర్శకులు అరెస్టవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సినీ నటుడు నవదీ్పను పోలీసులు విచారిస్తుండటం, అతనితో సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు ఉన్న లింకులు బయటపడుతుండడం సంచలనంగా మారింది. ఈ కేసులో నిర్మాత వెంటకరత్నా రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నవదీ్పతో పాటు డైరెక్టర్ శశాంక్, సినీ పరిశ్రమతో సంబంధాలున్న రవి ఉప్పలపాటి, కలహర్ రెడ్డి సహా 50 మంది నిందితులను గుర్తించారు.
నవదీప్ లింకులపై ఆరా
నవదీప్ శనివారం నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. సుమారు 6 గంటల పాటు విచారించిన పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. అతను టెక్నికల్గా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన మొబైల్ ఫోన్లో డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్ను ఫార్మేట్ చేసుకుని విచారణకు హాజరైనట్టు తెలిసింది. అయినా పోలీసులు కాల్ రికార్డుల ప్రకారం 81 మంది అనుమానితులతో నవదీ్పకు లింకులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు పబ్ నిర్వాహకులు, పార్టీలు నిర్వహించే ఆర్గనైజర్లు ఉన్నట్లు తెలిసింది. సుమారు 45 మంది వివరాలను నవదీప్ ద్వారా తెలుసుకున్న పోలీసులు మరో 36 మందిపై దృష్టి సారించారు. వారిలో ఎంతమందికి ఈ డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయి? వారికి నవదీ్పతో ఉన్న సంబంధం ఏంటి? ఎంతమంది పార్టీలకు వచ్చేవారు? ఎంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారనే అంశాలపై దృష్టి సారించారు. తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు నవదీప్ హైకోర్టును ఆశ్రయించడం, దాంతో అతన్ని అరెస్టు చేయొద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే.
కలహర్రెడ్డి వద్ద సెలబ్రెటీల గుట్టు!
సినిమా ఇండస్ట్రీతో సంబంధాలున్న కలహర్ రెడ్డి, రవి ఉప్పలపాటితో పాటు పాటు ఓ పబ్ యజమాని సూర్య సోమవారం నార్కోటిక్ బ్యూరో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కలహర్ రెడ్డి నోరు విప్పితే టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టయిన కలహర్ రెడ్డికి కన్నడ, తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలతో పాటు తెలంగాణ రాజకీయ ప్రముఖులకు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఆ విషయం వైరల్గా మారింది. మరోసారి డ్రగ్స్ కేసులో కలహర్రెడ్డి నిందితుడిగా ఉండటంతో ఇప్పుడు ఎంతమంది పేర్లు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.