పెళ్లికి ఫంక్షన్‌ హాల్‌ ఇచ్చేందుకు అంగీకారం

ABN , First Publish Date - 2023-06-01T03:43:05+05:30 IST

సింగరేణి కార్మికుడి కుమార్తె వివాహానికి ఫంక్షన్‌ హాలు ఇచ్చేందుకు ఎట్టకేలకు అధికారులు అంగీకరించారు.

పెళ్లికి ఫంక్షన్‌ హాల్‌ ఇచ్చేందుకు అంగీకారం

‘ముఖ్యమంత్రి వస్తున్నారు ఫంక్షన హాల్‌ ఇవ్వలేం’ శీర్షికతో బుధవారం ఆంధ్రజ్యోతిలో కథనం

స్పందించి వధువు తండ్రితో మాట్లాడిన అధికారులు

మంచిర్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుడి కుమార్తె వివాహానికి ఫంక్షన్‌ హాలు ఇచ్చేందుకు ఎట్టకేలకు అధికారులు అంగీకరించారు. ‘ముఖ్యమంత్రి వస్తున్నారు..ఫంక్షన్‌ హాల్‌ ఇవ్వలేం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన కథనానికి సింగరేణి అధికారులు స్పందించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ నివాసి పోతు సత్యనారాయణ కుమార్తె వివాహం జూన్‌ 9న నిశ్చయించారు. సత్యనారాయణ... తాను పనిచేస్తున్న శ్రీరాంపూర్‌ ఏరియాలోని సంస్థకు చెందిన సీసీసీలోని సింగరేణి గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాలును నెల రోజుల క్రితం బుక్‌ చేసుకున్నారు. కాగా, జూన 9న నస్పూర్‌లో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్నందున తాము ఫంక్షన్‌ హాలు ఇవ్వలేమని రెండు రోజుల క్రితం సింగరేణి అధికారులు సత్యనారాయణకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో శ్రీరాంపూర్‌ ఏరియా డీజీఎం పర్సనల్‌ అరవింద్‌ వధువు తండ్రి సత్యనారాయణను పిలిపించి పెళ్లికి ఫంక్షన్‌ హాలు ఇస్తామని, ఆందోళన చెందవద్దని చెప్పారు. దీంతో వధువు తండ్రి సత్యనారాయణ తన సమస్య పరిష్కారానికి కృషి చేసిన ’ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2023-06-01T03:43:05+05:30 IST