డిప్యుటేషన్పై ఆన్డ్యూటీలు రద్దు
ABN , Publish Date - Dec 31 , 2023 | 04:18 AM
రవాణాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముగ్గురు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లుగా ఈ శాఖలో కొందరు ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా డిప్యుటేషన్పై ఆన్డ్యూటీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆన్ డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్న వారిని వెనక్కి రప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఇచ్చిన ఆన్డ్యూటీ ఉత్తర్వులను రద్దు చేసింది. అలాగే ఈ శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. రాష్ట్రం మొత్తమ్మీద పెద్ద మొత్తంలో లంచాలు వచ్చే 12 చెక్ పోస్టుల్లో 92 మంది డిప్యుటేషన్పై ఆన్డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నారు.
వీరిలో ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కేటగిరిలకు చెందిన వారు గత ఐదారేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా గత సర్కారులోని పెద్దలకు భారీగా అమ్యామ్యాలు సమర్పించుకొని పోస్టులు దక్కించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఓ అధికారి కీలకంగా వ్యవహారించి పోస్టింగ్లు ఇప్పించారన్న విమర్శలున్నాయి. ఇటు డిప్యుటేషన్పై విధులు నిర్వహించడంతో ఆయా కార్యాలయాల్లో రెగ్యులర్ పోస్టుల కొరత ఏర్పడింది. దీంతో అక్కడి కార్యాలయాల పరిధిలో రెగ్యులర్గా చేపట్టాల్సిన పనులు నిలిచిపోయాయి. ప్రధానంగా వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాలకు ఫిట్నెస్ నిర్ధారణ, వాహనాల తనిఖీలు తదితర రెగ్యులర్ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం డిప్యుటేషన్లను రద్దు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ జేటీసీగా రమేశ్..
ముగ్గురు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ల (జేటీసీ) ను బదిలీ చేస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఐటీ, విజిలెన్స్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న రమేశ్ను హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్గా, హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ను జేటీసీ అడ్మిన్గా, అడ్మిన్ జేటీసీగా ఉన్న మమతా ప్రసాద్ను ఐటీ, విజిలెన్స్కి బదిలీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా నియామకమైన రమేశ్ శనివారమే బాధ్యతలు స్వీకరించారు.