రాగి జావలో పడి ఆరేళ్ల బాలిక మృతి
ABN , Publish Date - Dec 18 , 2023 | 02:48 AM
నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న రాగి జావ పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా కొరిటికల్ బడిలో ఘటన
ఇన్చార్జి హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు
మామడ/నిర్మల్ కల్చరల్, డిసెంబరు 17: నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న రాగి జావ పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన వంట సిబ్బంది నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలిగొంది. విద్యార్థులకు ఇచ్చేందుకు పాఠశాల ఆవరణలో రాగి జావ తయారు చేస్తుండగా ఆ పాత్రలో పడిన ఓ ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరిటికల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న కొండ్ర ప్రజ్ఞ(6) విరామ సమయంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు రాగి జావ తయారవుతున్న పాత్రలో పడింది. దీనిని గమనించిన ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడిన ప్రజ్ఞను బయటకు తీసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రజ్ఞ ఆదివారం కన్నుమూసింది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి కొరిటికల్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి ప్రదానోపాధ్యాయురాలిని కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.