111 GO: 111 జీవో రద్దు వెనుక 2 లక్షల కోట్ల కుంభకోణం
ABN , First Publish Date - 2023-06-02T02:42:07+05:30 IST
జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేయడం వెనుక రూ.2 లక్షల కోట్ల కుంభకోణం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.
జీవో ఉపసంహరణ కోసం రాజ్యసభలో గళమెత్తుతా
బీసీ భవన్లో సత్యాగ్రహ దీక్షలో ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, రాంనగర్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేయడం వెనుక రూ.2 లక్షల కోట్ల కుంభకోణం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్కు పర్యావరణ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని.. జీవో రద్దును సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 111 జీవో రద్దును నిరసిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృష్ణ య్య మాట్లాడుతూ.. 111 జీవో రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో న్యాయ పోరాటం చేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు.రాజ్యసభలో గళమెత్తుతానన్నారు. ‘‘ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే రూ.5-6 వేల కోట్లకు ఎదిగారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎ్సలు అవినీతికి పాల్పడుతున్నారు’’ అని ఆరోపించారు. కోదండరెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ పెద్ద లు, కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చేందుకే 111 జీవో ఎత్తివేశారని ఆరోపించారు. దీక్షలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, టీడీపీ నేత పి.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.