Share News

రాష్ట్రంలో మరో 10 కరోనా కేసులు

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:19 AM

తెలంగాణలో కొత్తగా మరో 10 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వీటిలో హైదరాబాద్‌లోనే 9 నమోదు కాగా, మరొకటి కరీంనగర్‌లో వెలుగుచూసింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంటున్న కేసులకు,

రాష్ట్రంలో మరో 10 కరోనా కేసులు

హైదరాబాద్‌లో 9, కరీంనగర్‌లో 1

రాజధానిలో గత 10 రోజుల్లో 48

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్తగా మరో 10 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వీటిలో హైదరాబాద్‌లోనే 9 నమోదు కాగా, మరొకటి కరీంనగర్‌లో వెలుగుచూసింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంటున్న కేసులకు, క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న కేసులకు మధ్య పొంతన కుదరడం లేదు. ఉదాహరణకు ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా కేవలం 7 కేసులే వచ్చినట్లు వైద్య శాఖ బులెటిన్‌ పేర్కొంది. కానీ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్‌లో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా సోకింది. ఆ వివరాలు బులెటిన్‌లో లేవు. అంతేకాదు అసలు ఆ జిల్లాలో ఆదివారం కేసులు నమోదు కాలేదని పేర్కొంది. కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 989 మందికి కరోనా పరీక్షలు చేశారు. 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని, మరో 12 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్యశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో గాంధీ, ఉస్మానియా, చెస్ట్‌, నిలోఫర్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో పది రోజుల్లో 48 మందికి వైరస్‌ సోకింది. ఇది ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్ష చేయించుకోగా వైరస్‌ నిర్ధారణ అయినవారి సంఖ్య. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులను కలిపితే కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Dec 26 , 2023 | 06:53 AM