అద్భుతం చేస్తారా?

ABN , First Publish Date - 2023-06-11T03:31:42+05:30 IST

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉండగా.. భారత్‌ విజయానికి ఇంకా 280 పరుగుల దూరంలో ఉంది. అటు ఆసీస్‌ మరో ఏడు వికెట్లు తీస్తే చాలు...

అద్భుతం చేస్తారా?

  • భారత్‌ లక్ష్యం 444

  • ప్రస్తుతం 164/3

  • విరాట్‌, రహానెపై ఆశలు

  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ 270/8 డిక్లేర్‌

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉండగా.. భారత్‌ విజయానికి ఇంకా 280 పరుగుల దూరంలో ఉంది. అటు ఆసీస్‌ మరో ఏడు వికెట్లు తీస్తే చాలు. ఈనేపథ్యంలో క్రీజులో ఉన్న విరాట్‌ కోహ్లీ (44 బ్యాటింగ్‌), రహానె (20 బ్యాటింగ్‌) భుజస్కంధాలపై భారత విజయావకాశాలున్నాయనడంలో సందేహం లేదు. కొండంత లక్ష్యాన్ని ఛేదించాలంటే ప్రస్తుత ఆటతీరునే మూడు సెషన్లపాటు కొనసాగిస్తే.. భారత్‌ టెస్టు చరిత్రలోనే అత్యధిక ఛేదనను పూర్తి చేసుకున్నట్టవుతుంది. అయితే వికెట్లు కోల్పోకుండా ఆడడం అత్యంత కీలకం. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 40 ఓవర్లలో 164/3 పరుగులు చేసింది. రోహిత్‌ (43) ఆకట్టుకున్నాడు. అంతకుముందు క్యారీ (66 నాటౌట్‌), స్టార్క్‌ (41) రాణించడంతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 270/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో కంగారూలకు 443 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజాకు మూడు, ఉమేశ్‌.. షమిలకు రెండేసి వికెట్లు దక్కాయి.

క్యారీ-స్టార్క్‌ దూకుడు: నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా దాదాపు రెండు సెషన్లు ఆడి తమ ఆధిక్యానికి మరో 147 పరుగులు జత చేసింది. ఈక్రమంలో మరో నాలుగు వికెట్లను కోల్పోయింది. రెండో సెషన్‌లో క్యారీ-స్టార్క్‌ జోడీ ఏడో వికెట్‌కు 120 బంతుల్లోనే 93 పరుగులు జత చేయడంతో భారత్‌ ముందు భారీ లక్ష్యం చేరింది. 123/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా.. భారత బౌలర్లు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. ఫలితంగా తొలి సెషన్‌లో 78 పరుగులే వచ్చాయి. పైగా శనివారం ఆట మూడో ఓవర్‌లోనే ఉమేశ్‌ బౌలింగ్‌లో లబుషేన్‌ వికెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే అలెక్స్‌ క్యారీ మరోసారి బౌలర్లను విసిగించాడు. గ్రీన్‌ (25)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఇక లంచ్‌ బ్రేక్‌ అనంతరం ఆసీస్‌ వ్యూహం మారింది. సాధ్యమైనంత వేగంగా ఆడి 400కు పైగా లక్ష్యాన్ని భారత్‌ ముందుంచాలనే ఆలోచనతో ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. క్యారీకి జత కలిసిన స్టార్క్‌ ఈ బాధ్యత తీసుకుంటూ వరుస ఫోర్లతో చెలరేగాడు. అటు క్యారీ కూడా అడపాదడపా ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఆధిక్యం 400 దాటిపోయింది. షమి వరుస ఓవర్లలో స్టార్క్‌, కమిన్స్‌ (5) వికెట్లను తీయడంతో 85వ ఓవర్‌లో ఆసీస్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

సానుకూల దృక్పథంతో..: 444 పరుగుల రికార్డు ఛేదనను భారత్‌ ఆత్మవిశ్వాసంతోనే ఆరంభించింది. రెండో సెషన్‌లో భారత్‌ 7.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్‌ చేసి టీ బ్రేక్‌కు వెళ్లింది. అయినా అప్పటికే జట్టు స్కోరు 41 పరుగులకు చేరింది. దీనికి ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ (18) వన్డే తరహాలో బ్యాట్లు ఝుళిపించడమే కారణం. ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి స్లిప్‌లో గ్రీన్‌ వివాదాస్పద క్యాచ్‌తో గిల్‌ వెనుదిరిగాడు. రీప్లేలో బంతి నేలకు తాకినట్టు కనిపించినా.. గ్రీన్‌ చేతివేళ్లు బంతి కిందే ఉన్నట్టు భావించిన థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. ఇక ఆఖరి సెషన్‌లోనూ రోహిత్‌కు జతగా పుజార (27) సైతం వేగం కనబరిచాడు. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే అర్ధసెంచరీ వైపు సాగుతున్న రోహిత్‌ను స్పిన్నర్‌ లియాన్‌ ఎల్బీగా వెనక్కిపంపాడు. తర్వాతి ఓవర్‌లోనే పుజారను కమిన్స్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ తడబడినట్టుగా కనిపించింది. కానీ విరాట్‌, రహానె జట్టును ఆదుకున్నారు. ఆసీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేశారు. దీంతో భారత్‌ మరో వికెట్‌ కోల్పోకుండా నాలుగో రోజును ముగించింది.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక ఛేదన (ఆసీస్‌పై 418) చేసిన జట్టుగా విండీస్‌ నిలిచింది.

3 టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు (70) బాదిన మూడో భారత బ్యాటర్‌గా రోహిత్‌. సెహ్వాగ్‌ (90), ధోనీ (78) ముందున్నారు.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: ఖవాజా (సి) భరత్‌ (బి) ఉమేశ్‌ 13; వార్నర్‌ (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 1; లబుషేన్‌ (సి) పుజార (బి) ఉమేశ్‌ 41; స్మిత్‌ (సి) శార్దూల్‌ (బి) జడేజా 34; హెడ్‌ (సి అండ్‌ బి) జడేజా 18; గ్రీన్‌ (బి) జడేజా 25; క్యారీ (నాటౌట్‌) 66; స్టార్క్‌ (సి) కోహ్లీ (బి) షమి 41; కమిన్స్‌ (సి సబ్‌) అక్షర్‌ (బి) షమి 5; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 84.3 ఓవర్లలో 270/8 డిక్లేర్‌. వికెట్ల పతనం: 1-2, 2-24, 3-86, 4-111, 5-124, 6-167, 7-260, 8-270. బౌలింగ్‌: షమి 16.3-6-39-2; సిరాజ్‌ 20-2-80-1; శార్దూల్‌ 8-1-21-0; ఉమేశ్‌ 17-1-54-2; జడేజా 23-4-58-3.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) లియాన్‌ 43; గిల్‌ (సి) గ్రీన్‌ (బి) బోలాండ్‌ 18; పుజార (సి) క్యారీ (బి) కమిన్స్‌ 27; విరాట్‌ (బ్యాటింగ్‌) 44; రహానె (బ్యాటింగ్‌) 20; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 40 ఓవర్లలో 164/3. వికెట్ల పతనం: 1-41, 2-92, 3-93. బౌలింగ్‌: కమిన్స్‌ 9-0-42-1; బోలాండ్‌ 11-1-38-1; స్టార్క్‌ 7-0-45-0; గ్రీన్‌ 2-0-6-0; లియాన్‌ 11-1-32-1.

ఓవల్‌లో విజయవంతమైన ఛేదనలు

లక్ష్యం నెగ్గినజట్టు ప్రత్యర్థి ఎప్పుడు

263 ఇంగ్లండ్‌ ఆస్ర్టేలియా 1902

253 వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ 1963

242 ఆస్ర్టేలియా ఇంగ్లండ్‌ 1972

225 వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ 1988

204 ఇంగ్లండ్‌ దక్షిణాఫ్రికా 1994

Updated Date - 2023-06-11T03:31:42+05:30 IST