2nd T20 India Won : టీమిండియాదే రెండో టీ20

ABN , First Publish Date - 2023-01-30T01:41:28+05:30 IST

మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో హార్దిక్‌ సేన 6 వికెట్ల తేడాతో గట్టెక్కింది. సూర్యకుమార్‌

2nd T20 India Won : టీమిండియాదే రెండో టీ20

కివీస్‌ 99 పరుగులకే కట్టడి

చెమటోడ్చి.. వంద పరుగుల లక్ష్య ఛేదన

వందే.. వణికించింది!

ఆఖరి ఓవర్‌లో గట్టెక్కిన భారత్‌

న్యూజిలాండ్‌ 99 ఆలౌట్‌

రెండో టీ20లో స్పిన్నర్ల హవా

ధనాధన్‌ ఫార్మాట్‌లో స్పిన్నర్ల జోరుకు ఇరు జట్ల బ్యాటర్లు హడలెత్తిపోయారు. ఇక, రెండో టీ20లో టీమిండియా వంద పరుగుల ఛేదనలో అంతా ఊపిరి బిగపట్టాల్సిన పరిస్థితి. చివరికి 19.5 ఓవర్లు ఆడి అతికష్టమ్మీద గట్టెక్కింది. విచిత్రమేమిటంటే.. భారత్‌-కివీ్‌స ఇన్నింగ్స్‌లో నమోదైన 239 బంతుల్లో ఒక్క సిక్సర్‌ కూడా రాకపోవడం గమనార్హం. స్వల్ప ఛేదనను కాపాడుకునే క్రమంలో న్యూజిలాండ్‌ బౌలర్ల పట్టువదలని పోరాటం కూడా ఆకట్టుకుంది.

లఖ్‌నవూ: మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో హార్దిక్‌ సేన 6 వికెట్ల తేడాతో గట్టెక్కింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (26 నాటౌట్‌) చివరికంటా నిలిచి విజయానికి సహకరించాడు. ఈ ఫలితంతో సిరీస్‌ 1-1తో సమమైంది. నిర్ణాయక మ్యాచ్‌ బుధవారం జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీ్‌సను భారత స్పిన్నర్లు అద్భుతంగా కట్టడి చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులే చేసింది. కెప్టెన్‌ శాంట్నర్‌ (19 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. అర్ష్‌దీ్‌పకు రెండు.. చాహల్‌, కుల్దీప్‌, హుడా, సుందర్‌, పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఛేదనలో భారత్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్‌ (19), హార్దిక్‌ (15 నాటౌట్‌) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు.

కష్టంగానే..: లక్ష్యం వంద పరుగులే అయినా భారత్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా ఏమీ సాగలేదు. కివీస్‌ నుంచి ఐదుగురు స్పిన్నర్లు అల్లాడించారు. దీంతో వరల్డ్‌ నెంబర్‌వన్‌ సూర్యకుమార్‌ ఆడిన 31 బంతుల్లో ఒక్క ఫోర్‌ మాత్రమే సాధించాడు. ఓపెనర్‌ గిల్‌ (11) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా ఇషాన్‌ నిదానంగా ఆడి తొమ్మిదో ఓవర్‌లో రనౌటయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే త్రిపాఠి (13)ని సోధీ అవుట్‌ చేయడంతో 50 పరుగులకు మూడు వికెట్లు పడ్డాయి. ఈ దశలో సూర్య, సుందర్‌ జోడీ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. నాలుగో వికెట్‌కు 20 పరుగులు జోడించారు. కానీ సుందర్‌ వారిస్తున్నా వినకుండా సూర్య రివర్స్‌స్వీప్‌ ఆడి రన్‌ కోసం పరిగెత్తుకొచ్చాడు. దీంతో అతడి కోసం తను వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే హార్దిక్‌తో జత కట్టిన సూర్య చివరి ఓవర్‌ వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఓ దశలో కివీస్‌ స్పిన్నర్ల ధాటికి 11.1 ఓవర్‌ తర్వాత మరో ఫోర్‌ సాధించేందుకు భారత్‌ 19వ ఓవర్‌ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. హార్దిక్‌ సాధించిన ఈ ఫోర్‌తో ఆ ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం ఆరు బంతుల్లో ఆరు పరుగులకు చేరింది. తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే రావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే సూర్యకుమార్‌ ఐదో బంతిని ఫోర్‌గా మలచడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది.

పరుగులకు కటకట: ఈ పిచ్‌పై ఛేజింగ్‌ కష్టమనే భావనతో కివీస్‌ కెప్టెన్‌ శాంట్నర్‌ టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కానీ అతడి అంచనా పూర్తిగా గతి తప్పింది. వికెట్‌ అద్భుతంగా టర్న్‌ కావడంతో జట్టులోని నలుగురు స్పిన్నర్లు తడాఖా చూపారు. దీంతో స్పెషలిస్ట్‌ పేసర్లు అర్ష్‌దీప్‌, మావి చివరి మూడు ఓవర్లకే పరిమితమయ్యారు. మూడో ఓవర్‌లో ఆలెన్‌ (11) రెండు ఫోర్లతో టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. కానీ చాహల్‌ తన తొలి ఓవర్‌లోనే అతడిని బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే ఫామ్‌లో ఉన్న కాన్వే (11)ను సుందర్‌ అవుట్‌ చేయడంతో కివీ్‌సకు భారీ షాక్‌ తగిలినట్టయ్యింది. దీంతో పవర్‌ప్లేలో జట్టు 33/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత ఫిలిప్స్‌ (5)ను హుడా వెనక్కి పంపాడు. ఈ ముగ్గురూ రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నంలోనే అవుట్‌ కావడం గమనార్హం. ఇక తొలి టీ20 ఆఖరి ఓవర్‌లో దుమ్ము రేపిన డారిల్‌ మిచెల్‌ (8)ను కుల్దీప్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు అతిపెద్ద రిలీ్‌ఫనందించాడు. అప్పటికి 10 ఓవర్లలో స్కోరు 48/4 మాత్రమే. ఈ దశలో ఆదుకుంటాడనుకున్న బ్రేస్‌వెల్‌ (14) 17వ ఓవర్‌లో పాండ్యాకు దొరికిపోయాడు. అంతకుముందే చాప్‌మన్‌ (14) రనౌటయ్యాడు. ఇక 18వ ఓవర్‌లో బంతి చేతపట్టిన అర్ష్‌దీప్‌ కేవలం మూడు పరుగులకే సోధీ (1), ఫెర్గూసన్‌ (0)ల వికెట్లను తీశాడు. 19వ ఓవర్‌లో మావి 11 పరుగుల్విడంతో స్కోరులో కాస్త కదలిక వచ్చింది. ఇక అర్ష్‌దీప్‌ ఆఖరి ఓవర్‌ను ఈసారి పకడ్బందీగా వేసి 5పరుగులే ఇచ్చాడు. కెప్టెన్‌ శాంట్నర్‌ చివరికంటా నిలిచినా చేసేదేమీ లేకపోయింది.

1 టీ20ల్లో భారత్‌పై కివీస్‌కిదే అత్యల్ప స్కోరు (99).

2 ఓ టీ20 మ్యాచ్‌లో ఎక్కువ ఓవర్లు (17) స్పిన్నర్లకిచ్చిన రెండో జట్టుగా కివీస్‌. అలాగే 2016 తర్వాత భారత్‌ తరఫున స్పిన్నర్లు 13 ఓవర్లు వేయడం విశేషం.

స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: అలెన్‌ (బి) చాహల్‌ 11, కాన్వే (సి) ఇషాన్‌ (బి) వాషింగ్టన్‌ 11, చాప్‌మన్‌ (రనౌట్‌) 14, ఫిలిప్స్‌ (బి) హుడా 5, డారిల్‌ మిచెల్‌ (బి) కుల్దీప్‌ 8, బ్రేస్‌వెల్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) పాండ్యా 14, శాంట్నర్‌ (నాటౌట్‌) 19, సోధి (సి) పాండ్యా (బి) అర్ష్‌దీప్‌ 1, ఫెర్గూసన్‌ (సి) వాషింగ్టన్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, డఫీ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 99/8; వికెట్ల పతనం: 1-21, 2-28, 3-35, 4-48, 5-60, 6-80, 7-83, 8-83; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 4-0-25-1, వాషింగ్టన్‌ 3-0-17-1, చాహల్‌ 2-1-4-1, దీపక్‌ హుడా 4-0-17-1, కుల్దీప్‌ 4-0-17-1, అర్ష్‌దీప్‌ 2-0-7-2, శివమ్‌ మావి 1-0-11-0.

భారత్‌: గిల్‌ (సి) అలెన్‌ (బి) బ్రేస్‌వెల్‌ 11, ఇషాన్‌ (రనౌట్‌) 19, త్రిపాఠి (సి) ఫిలిప్స్‌ (బి) సోధి 13, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 26, వాషింగ్టన్‌ (రనౌట్‌) 10, హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.5 ఓవర్లలో 101/4; వికెట్ల పతనం: 1-17, 2-46, 3-50, 4-70; బౌలింగ్‌: డఫీ 1-0-8-0, బ్రేస్‌వెల్‌ 4-0-13-1, శాంట్నర్‌ 4-0-20-0, ఫిలిప్స్‌ 4-0-17-0, సోధి 4-0-24-1, చాప్‌మన్‌ 1-0-4-0, ఫెర్గూసన్‌ 1-0-7-0, టిక్నర్‌ 0.5-0-7-0.

Updated Date - 2023-01-30T07:46:20+05:30 IST