వన్డేల్లోకి శ్రేయాంక, సైకా
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:35 AM
యువ క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, టిటాస్ సంధు తొలిసారి భారత మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకొన్నారు.
మన్నత్, టిటాస్ కూడా
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, టిటాస్ సంధు తొలిసారి భారత మహిళల వన్డే జట్టులో చోటు దక్కించుకొన్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీ్సలకు టీమిండియాను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్ ఈనెల 28న ముంబైలో ఆరంభం కానుండగా.. జనవరి 5 నుంచి మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన టీ20ల్లో పాటిల్ అరంగేట్రం చేయగా.. 20ఏళ్ల లెఫ్టామ్ స్పిన్నర్ కశ్య్పకు తుది జట్టులో చోటు లభించలేదు. టిటాస్ సంధు, కశ్యప్ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన జట్టు సభ్యులు. మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై తరఫున సైకా టాప్ బౌలర్గా నిలిచింది. స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ వన్డేలకు ఎంపికవగా.. పొట్టి ఫార్మాట్లో వీరి స్థానాల్లో కనికా, మిన్నూ మణికి అవకాశం కల్పించారు.