షిండే సెంచరీ

ABN , First Publish Date - 2023-02-02T00:48:04+05:30 IST

కరణ్‌ షిండే (110) శతకం చేయడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో ఆంధ్ర భారీస్కోరు సాధించింది.

షిండే సెంచరీ

ఇండోర్‌: కరణ్‌ షిండే (110) శతకం చేయడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో ఆంధ్ర భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 262/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 379 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు రికీ భుయ్‌ (149), కరణ్‌ మూడో వికెట్‌కు 251 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముందు రోజు రిటైర్డ్‌ హర్ట్‌ అయిన కెప్టెన్‌ హనుమ విహారి (27) ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేసి తన వ్యక్తిగత స్కోరుకు మరో 11 పరుగులు జత చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 144/4 స్కోరు చేసింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఎంపీ ఇంకా 235 పరుగులు వెనుకబడింది.

హనుమ ఒంటిచేత్తో..: గాయంతో బాధపడుతున్న ఆంధ్ర సారథి హనుమ విహారి ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేసితన నిబద్ధతను చాటుకున్నాడు. 2021లో సిడ్నీ టెస్టులో తొడ కండర గాయం బాధపెడుతున్నా.. నాలుగు గంటలపాటు క్రీజులో నిలిచి టీమిండియాను ఓటమి నుంచి కాపాడాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో 9వ వికెట్‌ పడిన తర్వాత క్రీజులోకి వచ్చి ఆడాడు. మంగళవారం 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవేశ్‌ ఖాన్‌ బౌన్సర్‌ విహారి ఎడమచేతి మణికట్టుకు బలంగా తగలడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. చేతి ఎముక చిట్లినట్టు ఎక్స్‌రేలో తేలింది. కాగా, రెండో రోజు మిగిలిన బ్యాటర్లు అవుట్‌ కావడంతో చివరగా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. స్వతహాగా కుడి చేతి వాటం బ్యాటర్‌ అయిన విహారి.. లెఫ్ట్‌హ్యాండర్‌గా బ్యాటింగ్‌ చేశాడు.

Updated Date - 2023-02-02T00:48:05+05:30 IST