నీరజ్.. రజతంతో సరి
ABN , First Publish Date - 2023-09-18T01:06:58+05:30 IST
ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు...

డైమండ్ లీగ్ గ్రాండ్ ఫైనల్
యూజిన్ (అమెరికా): ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. శనివారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన లీగ్ గ్రాండ్ ఫైనల్లో భారత స్టార్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జావెలిన్ను 83.80 మీటర్ల దూరం విసిరి రజత పతకానికి పరిమితమయ్యాడు. రెండుసార్లు ఫౌల్ చేసిన నీరజ్ తన అత్యుత్తమ దూరాన్ని రెండో యత్నంలో చేరుకున్నాడు. మొదట ఫౌల్ చేసిన చోప్రా ఆపై 83.80మీ., 81.37 మీ., ఫౌల్, 80.74 మీ., 80.90 మీ. నమోదు చేశాడు. ఈ సీజన్లో అతడు 85 మీ. మార్క్ను అందుకోలేకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2022 జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో 88.44 మీ. దూరంతో చోప్రా స్వర్ణ పతకం గెలుపొందిన విషయం విదితమే. యూజిన్లో వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో బరిలో దిగిన ఆరుగురిలో ఒక్క జావెలిన్ త్రోయర్ కూడా 85 మీ. దూరాన్ని అందుకోలేకపోయారు. జాకబ్ వాడ్లేచ్ (చెక్ రిపబ్లిక్) 84.24 మీ. దూరంతో విజేతగా నిలిచాడు. అతడు మూడోసారి డైమండ్ లీగ్ టైటిల్ నెగ్గడం విశేషం. అలివర్ హెలాండర్ (ఫిన్లాండ్, 83.74 మీ.) మూడో స్థానం దక్కించుకున్నాడు.