Mohit Sharma: మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి `ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`.. మోహిత్ శర్మ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులంటే..

ABN , First Publish Date - 2023-04-14T10:50:43+05:30 IST

మోహిత్ శర్మ.. నాలుగేళ్ల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు ప్రధాన బౌలర్. అలాంటిది 2020 సీజన్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్‌కు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కూడా ఇంటికే పరిమితమయ్యాడు.

Mohit Sharma: మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి `ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`.. మోహిత్ శర్మ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులంటే..

మోహిత్ శర్మ (Mohit Sharma).. నాలుగేళ్ల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్‌కు ప్రధాన బౌలర్. అలాంటిది 2020 సీజన్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్‌కు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కూడా ఇంటికే పరిమితమయ్యాడు. ఆ తర్వాతి సీజన్లలో మోహిత్‌ను తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. దీంతో ఖాళీగా ఇంట్లోనే ఉండిపోయాడు. గతేడాది గుజరాత్ కోచ్ ఆశీష్ నెహ్రా (Ashish Nehra).. మోహిత్‌కు ఫోన్ చేశాడు. గుజరాత్ టీమ్‌కు నెట్ బౌలర్‌గా ఉండాలని అడిగాడు.

గతంలో ప్రధాన బౌలర్‌నైన తాను నెట్ బౌలర్‌గా ఉండాలా? అని మోహిత్ సిగ్గుపడలేదు. ఇంట్లో ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకలా క్రికెట్‌లో భాగమైతే చాలనుకున్నాడు. గత సీజన్ మొత్తం గుజరాత్ (GT) టీమ్‌తో పాటే ఉండి బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేసేవాడు. చివరకు ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మోహిత్‌ను గుజరాత్ నామమాత్రపు ధరకు తీసుకుంది. దీంతో మోహిత్ కెరీర్ మళ్లీ మొదలైంది. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో మోహిత్‌కు తుది జట్టులో స్థానం దొరకలేదు.

Viral Video: గుజరాత్ టీమ్ విన్నింగ్ మూమెంట్స్.. స్టేడియంలో అభిమానులు ఎలా పండగ చేసుకున్నారో చూడండి..

గురువారం సాయంత్రం పంజాబ్ కింగ్స్‌తో (PBKSvsGT) జరిగిన మ్యాచ్‌లో మోహిత్‌కు స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో వచ్చిన అవకశాన్ని మోహిత్ చక్కగా వినియోగించుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా కూడా నిలిచాడు. కోచ్ ఆశిష్ నెహ్రా వల్లే తాను తిరిగి కెరీర్ మొదలుపెట్టానని మోహిత్ తెలిపాడు.

Updated Date - 2023-04-14T10:50:43+05:30 IST