Miandad: మీరొస్తే ఎంత.. రాకపోతే ఎంత?
ABN , First Publish Date - 2023-02-07T02:56:22+05:30 IST
ఆసియాకప్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్లో జరిగే ఈ టోర్నమెంట్కు బీసీసీఐ దూరంగా ఉండాలనుకుంటోంది.
టీమిండియాపై మియాందాద్
కరాచీ: ఆసియాకప్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్లో జరిగే ఈ టోర్నమెంట్కు బీసీసీఐ దూరంగా ఉండాలనుకుంటోంది. ఎట్టి పరిస్థితిల్లోనూ పాక్ గడ్డపై అడుగుపెట్టబోమని ఇదివరకే బోర్డు కార్యదర్శి జైషా ప్రకటించాడు. అయితే తమ ఆతిథ్య హక్కులను వదులుకోబోమని అటు పీసీబీ కూడా తెగేసి చెబుతోంది. బహ్రెయిన్లో జరిగిన ఏసీసీ సమావేశంలోనూ ఏ విషయం తేలలేదు. తటస్థ వేదికగా యూఏఈ పేరు వచ్చినా ఇంకా స్పష్టత రాలేదు. మార్చిలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అటు బీసీసీఐ వైఖరిని పాక్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ తీవ్రంగా ఖండించాడు. ‘భారత జట్టు పాక్కు వస్తే ఎంత? రాకపోతే ఎంత? అసలు బీసీసీఐని అదుపు చేయలేకపోతే ఇక ఐసీసీ ఉండి ఏం ప్రయోజనం? అన్ని జట్లకూ ఒకే నిబంధన ఉండాలి. అయినా ప్రపంచ క్రికెట్ను బీసీసీఐ నడపడం లేదు. అన్నింటా మీ మాటే నెగ్గాలంటే కుదరదు?’ అంటూ మియాందాద్ ఘాటుగా స్పందించాడు.