Thailand Open : క్వార్టర్స్లో కిరణ్, లక్ష్యసేన్
ABN , First Publish Date - 2023-06-02T03:47:30+05:30 IST
భారత షట్లర్ కిరణ్ జార్జ్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో జోరు కొనసాగిస్తూ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు.
సైనా, సాత్విక్ జోడీ ఓటమి
థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్: భారత షట్లర్ కిరణ్ జార్జ్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో జోరు కొనసాగిస్తూ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. అలాగే మరో యువ ఆటగాడు లక్ష్యసేన్ కూడా ముందంజ వేయగా, సైనా నెహ్వాల్, సాత్విక్/చిరాగ్ జోడీ పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో వరల్డ్ నెం. 59 కిరణ్ 21-11, 21-19 స్కోరుతో ప్రపంచ 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ (చైనా)ను వరుస గేముల్లో చిత్తు చేశాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ 500 టోర్నీలో కిరణ్ క్వార్టర్స్కు చేరడం ఇదే తొలిసారి. తదుపరి రౌండ్లో జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జార్జ్ తలపడతాడు. మరో సింగిల్స్ రౌండ్-16 మ్యాచ్లో లక్ష్యసేన్ 21-15, 21-17 స్కోరుతో నాలుగో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా)కు షాకిచ్చాడు. క్వార్టర్ఫైనల్లో జున్ హవో (మలేసియా)ను సేన్ ఢీకొంటాడు. మహిళల సింగిల్స్లో వెటరన్ సైనా నెహ్వాల్ 11-21, 14-21 స్కోరుతో మూడో సీడ్ హె బింగ్ జియావో (చైనా) చేతిలో ఓటమితో టోర్నీనుంచి వైదొలగింది. ఇంకో సింగిల్స్లో 23 ఏళ్ల అస్మిత చలిహా 18-21, 13-21తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్లో స్టార్ ద్వయం సాత్విక్/చిరాగ్ 26-24, 11-21, 17-21 స్కోరుతో ఫిక్రి/మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓడి తిరుగు ముఖం పట్టింది.