అమెరికాలో తేల్చుకుందాం!
ABN , First Publish Date - 2023-08-12T02:00:34+05:30 IST
నెల రోజులపాటు సాగిన భారత జట్టు కరీబియన్ పర్యటన ఇప్పుడు అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరింది.
రాత్రి 8 గం.నుంచి డీడీ స్పోర్ట్స్లో..
సిరీస్ సమం కోసం భారత్ ఆరాటం
నేడు విండీ్సతో నాలుగో టీ20
లాడర్హిల్: నెల రోజులపాటు సాగిన భారత జట్టు కరీబియన్ పర్యటన ఇప్పుడు అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరింది. ఐదు టీ20ల సిరీ్సలో మిగిలిన రెండు కీలక మ్యాచ్లు ఇక్కడి లాడర్హిల్ సిటీలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగే నాలుగో మ్యాచ్లో భారత్, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2-1 ఆధిక్యంలో ఉన్న విండీస్ ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలోనే ఉంది. అటు సిరీ్సను సమం చేసి ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్లో గెలుపు అత్యంత కీలకం. మూడో టీ20 నెగ్గిన ఉత్సాహంతో ఉన్న హార్దిక్ సేన నాలుగో మ్యాచ్లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
గిల్ ఫామ్ ఆందోళనకరం: టీమిండియా బ్యాటింగ్లో ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ అందించిన భాగస్వామ్యాలు 5, 16 మాత్రమే. జట్టుకు శుభారంభం దక్కకపోవడంతో మిడిలార్డర్పై ఒత్తిడి పడుతోంది. అందుకే మూడో మ్యాచ్కు ఇషాన్ను పక్కనబెట్టి యశస్వీ జైస్వాల్ను పరీక్షించారు. కానీ యశస్వీ తొలి ఓవర్లోనే వెనుదిరిగి నిరాశపరిచాడు. దీనికితోడు మరో ఓపెనర్ గిల్ ఫామ్ కూడా ఆందోళనకరంగా ఉంది. ఈ టూర్లో అతను అన్ని మ్యాచ్లు ఆడినా ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకే అతడి స్థానంలో తిరిగి ఇషాన్కు అవకాశమిస్తారా? అనేది చూడాలి. లోయరార్డర్లో అండగా నిలిచే బ్యాటర్ లేకపోవడంతో టాపార్డర్ ఇన్నింగ్స్ కీలకం కానుంది. తిలక్ వర్మ ఒక్కడే నిలకడగా రాణిస్తుండగా.. చివరి మ్యాచ్లో సూర్యకుమార్ టచ్లోకి రావడం సానుకూలాంశం. స్పిన్ త్రయం కుల్దీప్, చాహల్, అక్షర్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా పూరన్ దూకుడును కుల్దీప్ అడ్డుకోవడం మూడో మ్యాచ్లో కీలక పరిణామం. పిచ్ పేస్కు అనుకూలిస్తే చాహల్ స్థానంలో ఉమ్రాన్, అవేశ్ ఖాన్లలో ఒకరిని పరీక్షించే అవకాశం లేకపోలేదు.
సిరీ్సపై గురి: వరుసగా రెండు విజయాలతో ఊపు మీద కనిపించిన విండీస్ కీలకమైన మూడో టీ20లో తడబడింది. కానీ నాలుగో మ్యాచ్లో గెలుపుతో ఇక్కడే సిరీ్సను పట్టేయాలనుకుంటోంది. అయితే ఆ జట్టు టాపార్డర్ స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు. ఓపెనర్లు కింగ్, మేయర్స్లలో ఒక్కరే ఫామ్ కనబరుస్తున్నారు. మిడిలార్డర్లో పూరన్, కెప్టెన్ పావెల్ ఆకట్టుకుంటున్నా.. హెట్మయెర్ విఫలమవుతున్నాడు. గాయంతో మూడో మ్యాచ్కు దూరమైన ఆల్రౌండర్ హోల్డర్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే రోస్టన్ చేజ్ పెవిలియన్కే పరిమితమవుతాడు. బౌలింగ్ విభాగంలో మార్పులు చేయకపోవచ్చు.
పిచ్, వాతావరణం
ఆకాశం మేఘావృతంగా ఉన్నా వర్షంతో ఇబ్బందిలేకపోవచ్చు. స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇక్కడ జరిగిన 13 మ్యాచ్ల్లో 11 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అలాగే గతేడాది భారత్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గడం విశేషం.
తుది జట్లు (అంచనా)
భారత్: జైస్వాల్, గిల్/ఇషాన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ (కెప్టెన్), శాంసన్, అక్షర్, కుల్దీప్, చాహల్, అర్ష్దీప్, ముకేశ్.
వెస్టిండీస్: కింగ్/హోప్, మేయర్స్, చార్లెస్, పూరన్, పావెల్ (కెప్టెన్), హెట్మయెర్, షెఫర్డ్, హోల్డర్/చేజ్, హొసేన్, జోసెఫ్, మెకాయ్.