బంతి పదునెక్కాలి
ABN , First Publish Date - 2023-11-26T02:42:34+05:30 IST
తమ టీ20 చరిత్రలో అత్యధిక ఛేదన చేసిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీ్సను శుభారంభం చేసినా బౌలింగ్లో విఫలమైంది.
మరో విజయంపై భారత్ దృష్టి
నేడు ఆస్ట్రేలియాతో రెండో టీ20
రాత్రి 7 గం. నుంచి స్పోర్ట్స్18, డీడీ స్పోర్ట్స్లో..
తిరువనంతపురం: తమ టీ20 చరిత్రలో అత్యధిక ఛేదన చేసిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీ్సను శుభారంభం చేసినా బౌలింగ్లో విఫలమైంది. యువ బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో భారత జట్టుకు రికార్డు స్థాయిలో భారీ స్కోరును ఛేదించాల్సి వచ్చింది. పేసర్ ముకేశ్ కుమార్ మాత్రం ఇతరులకు భిన్నంగా బౌలింగ్ వేస్తూ పరుగులను అడ్డుకున్నాడు. అటు సూర్యకుమార్, ఇషాన్ మెరుపు బ్యాటింగ్తో తొలి మ్యాచ్లో జట్టు గట్టెక్కింది. ఈనేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 జరుగనుంది. ఈ పోరులో మాత్రం భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపాలనుకుంటోంది. ఇక ఆసీస్ విజయం కోసం ఆఖరి బంతి వరకు గట్టిగానే పోరాడినా రింకూ సింగ్ మాయతో ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్లో పొరపాటుకు తావీయకుండా ఆతిథ్య జట్టుకు ఝలకివ్వాలనుకుంటోంది.
పరుగులను కట్టడి చేస్తేనే..: ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులుండకపోవచ్చు. తొలి మ్యాచ్లో ఇన్గ్లి్స బాదుడుకు పేసర్లు అర్ష్దీప్ ఓవర్కు 10.25, ప్రసిద్ధ్ 12.50 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సైతం ఓవర్కు 13.50 పరుగులిచ్చాడు. అయితే పొట్టి ఫార్మాట్లో ఇది సహజమే అనిపించినా ఈ ముగ్గురి బౌలింగ్లో ఎలాంటి వైవిధ్యం లేకుండా పోయింది. నేరుగా బంతులు బ్యాట్ మీదికి రావడంతో ఇన్గ్లి్స, స్మిత్ పరుగులు రాబట్టారు. సిరీ్సలో ఆధిక్యం 2-0కి చేరాలంటే వీరు గణనీయంగా మెరుగుపడాల్సి ఉంటుంది. అదే పిచ్పై ముకేశ్ మాత్రం యార్కర్లు, బౌన్సర్లు, ఆఫ్ స్టంప్ ఆవలకు బంతులు విసురుతూ ఇబ్బందిపెట్టాడు. ఆఖరి ఓవర్లోనైతే కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. లేకుంటే చివర్లో భారత్ ఛేదన మరింత కష్టమయ్యేది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడుతుండడం వల్ల లయ తప్పినట్టు చెబుతున్నా.. అలాంటి వ్యాఖ్యలు సరికావు. ఈ రోజుల్లో షెడ్యూల్ ఇలాగే ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా వినియోగించుకోవాల్సిందే. బిష్ణోయ్లాంటి వాళ్లకు ఇది మరీ ముఖ్యం. మరోవైపు బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఆందోళపడాల్సిన అవసరం లేకపోయింది. సూర్యకుమార్, ఇషాన్, రింకూ, జైస్వాల్ ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడారు. ఇషాన్ ఆదిలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. అయితే తను డాట్ బాల్స్ను తగ్గించుకోవాల్సి ఉంది. రుతురాజ్ దురదృష్టవశాత్తు బంతి ఎదుర్కోకుండానే రనౌట్ కావాల్సి వచ్చింది. తిలక్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా నేటి మ్యాచ్లో సత్తా చాటాలనుకుంటున్నాడు. వికెట్ల మధ్య రన్నింగ్ను కూడా బ్యాటర్లు మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తొలి మ్యాచ్లో ముగ్గురు రనౌట్లు కావడం గమనార్హం.
కసిగా ఆసీస్: వైజాగ్ మ్యాచ్లో ఓడినా.. ఆసీస్ జట్టు పలు అంశాల్లో పాజిటివ్గానే ఉంది. కెరీర్లో తొలిసారి ఓపెనర్ పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీతో రాణించగా.. జోష్ ఇన్గ్లి్స కూడా ఓపెనింగ్లో సత్తా చాటడంతో పాటు 47 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. రానున్న టీ20 ప్రపంచక్పనకు ముందు ఆసీ్సకిది సానుకూలాంశం కానుంది. అయితే 41 బంతుల్లో 52 పరుగులు చేసిన స్మిత్ ఆటలో వేగం లేకపోవడంతో మరో 10-20 రన్స్ను ఆసీస్ కోల్పోయింది. కానీ ఇన్గ్లి్స దూకుడు అతడి తడబాటును కప్పిపుచ్చింది. భారత బౌలర్ల మాదిరే ఆసీస్ కూడా ధారాళంగా పరుగులిచ్చుకుంది. పేసర్ బెహ్రెన్డార్ఫ్ మినహా అంతా సూర్య, ఇషాన్ల బాదుడుకు బలయ్యారు. ఆదివారం మ్యాచ్లో ఈ లోపాన్ని సరిదిద్దుకుని భారత్ను దెబ్బతీయాలనుకుంటోంది.
జట్లు (అంచనా)
భారత్: రుతురాజ్, యశస్వీ, ఇషాన్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్, ముకేశ్.
ఆస్ట్రేలియా: షార్ట్, స్మిత్, ఇన్గ్లి్స, హార్డీ, స్టొయినిస్, డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), అబాట్, ఎల్లిస్, బెహ్రెన్డార్ఫ్, తన్వీర్ సంఘా.
పిచ్, వాతావరణం
గ్రీన్ఫీల్డ్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలించనుంది. ఇక్కడ జరిగిన చివరి టీ20లో దక్షిణాఫ్రికా 9 రన్స్కే 5 వికెట్లు కోల్పోయింది. ఓవరాల్గా మూడు టీ20లు జరగ్గా స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. వరల్డ్కప్ వామప్ మ్యాచ్లోనూ నెదర్లాండ్స్పై స్టార్క్ హ్యాట్రిక్ తీశాడు. ఇక శనివారం భారీ వర్షం కురవడంతో స్టేడియం మడుగును తలపించింది. ఆదివారం కూడా వర్షం పడే చాన్స్ 25 శాతంగా ఉన్నట్టు సమాచారం.