Share News

Vrinda Dinesh: ‘కోటి’కు పడగలెత్తిన క్రీడాకారిణి.. అసలెవరీ వృందా దినేశ్?

ABN , First Publish Date - 2023-12-09T19:50:47+05:30 IST

సాధారణంగా స్పోర్ట్స్ బిడ్డింగ్‌లో స్టార్ ప్లేయర్లు కోట్లకు పడగలెత్తుతుంటారు. ఆ ప్లేయర్స్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని.. ఫ్రాంచైజీలు పోటీపడి మరీ వేలం పాట పాడుతాయి. కానీ.. అన్‌క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో మాత్రం అంత పోటీ ఉండదు. వారికి లక్షలు రావడం కూడా గగనమే!

Vrinda Dinesh: ‘కోటి’కు పడగలెత్తిన క్రీడాకారిణి.. అసలెవరీ వృందా దినేశ్?

Vrinda Dinesh WPL Auction: సాధారణంగా స్పోర్ట్స్ బిడ్డింగ్‌లో స్టార్ ప్లేయర్లు కోట్లకు పడగలెత్తుతుంటారు. ఆ ప్లేయర్స్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని.. ఫ్రాంచైజీలు పోటీపడి మరీ వేలం పాట పాడుతాయి. కానీ.. అన్‌క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో మాత్రం అంత పోటీ ఉండదు. వారికి లక్షలు రావడం కూడా గగనమే! అయితే.. వృందా దినేశ్ అనే క్రీడాకారిణి మాత్రం తొలిసారి కోటికి పడగలెత్తింది. విమెన్ ప్రీమియర్ లీగ్-2024లో ఆమె 1.3 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది.

తొలుత వేలంలో రూ.10 లక్షల ప్రాథమిక ధరతో వేలం మొదలయ్యింది. ఈ 22 ఏళ్ల క్రీడాకారిణిని సొంతం చేసుకోవడం కోసం గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట్లో పోటీ పడ్డాయి. మధ్యలో యూపీ వారియర్స్ రంగంలోకి దిగి.. చివరికి ఆ ఫ్రాంచైజీ రూ.1.3 కోట్లకు ఆమెను సొంతం చేసుకుంది. తొలిసారి ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడంతో.. వృందా దినేశ్ గురించే చర్చలు నడుస్తున్నాయి. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంత డిమాండ్ ఎందుకు? అనే అంశాలపై చర్చించుకుంటున్నారు.


కర్ణాటకకు చెందిన వృందా.. కన్సిస్టెన్సీ, భారీ షాట్లకు పేరుగాంచింది. హాంకాంగ్‌లో జరిగిన 2023 ACC ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో భారత జట్టులో స్థానం సంపాదించినప్పుడు.. ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన వృందా.. కేవలం 29 బంతుల్లో 36 పరుగులు చేసి, భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఇంగ్లండ్ Aతో జరిగిన మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో ఆమె ఇండియా-A జట్టులో చోటు సంపాదించుకుంది.

కేవలం బ్యాటింగ్ విషయంలోనూ కాదు.. వృందా ఒక పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్ కూడా! ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మైదానంలో ఆమె సత్తా చాటుతోంది. సీనియర్ మహిళల వన్డే పోటీలో కర్నాటక ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె సహకారం ఎంతో కీలకమైంది. ఆ సిరీస్‌లో ఆమె మొత్తం 11 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన మూడో క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో మూడు అర్థశతకాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 81 పరుగులు నమోదు చేసింది.

ఒక్క వృందా దినేశ్ మాత్రమే కాదు.. ఆమె ఆమె తండ్రి, మామ, కజిన్ అందరూ క్లబ్ స్థాయిలో క్రికెట్ ఆడారు. తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచి వృందా తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించింది. క్రమంగా ఈ క్రీడలో ఎదుగుతూ.. కర్ణాటక U19 జట్టులో స్థానం సంపాదించింది. ఇప్పుడు WPL 2024 వేలంలో ఏకంగా 1.3 కోట్లకు అమ్ముడుపోయి.. సరికొత్త సంచలనానికి తెరలేపింది.

Updated Date - 2023-12-09T19:50:48+05:30 IST